ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా అమ్మకు మరణశిక్ష ఖాయం..: షేక్ హసీనా కుమారుడు

international |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 09:05 PM

 బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారాయి. మానవత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం రోజు తీర్పు వెలువరించనుంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతుండగా.. షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి మరణశిక్ష పడడం ఖాయమని వివరించారు. ఇందుకు సంబంధించిన తీర్పు, విచారణను టీవీల్లో కూడా చూపించనున్నారని చెప్పారు. తన తల్లికి మరణ శిక్ష పడినా.. ఆమెను ఎవరూ ఏం చేయలేరని పేర్కొన్నారు.


ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివసిస్తున్న షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్.. ఈ పరిణామాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అమ్మపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో మాకు తెలుసని అన్నారు. ఈ తీర్పును వారు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని చెప్పారు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారని.. బహుశా ఆమెకు మరణశిక్ష విధిస్తారేమోనని వాజేద్ వెల్లడించారు. అయితే తన తల్లి సురక్షితంగా ఉన్నారని ఆయన ధైర్యాన్ని వ్యక్తం చేశారు. "అయినా వారు నా తల్లిని ఏం చేయగలరు? ఆమె భారత్‌లో సురక్షితంగా ఉంది" అని వాజేద్ స్పష్టం చేశారు. హసీనా గతేడాది ఆగస్టు 5న ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు.


కేవలం మరణశిక్ష భయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సాజిబ్ వాజేద్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లి నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికలను అవామీ లీగ్ కార్యకర్తలు అడ్డుకుంటారని ఆయన తెలిపారు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా వర్చువల్‌గా తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనపై నమోదైన కేసులన్నీ చట్ట విరుద్ధమని, కుట్రలు చేసి తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.


"అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు నేరగాళ్లు హీరోలు అవుతున్నారు. ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణచివేయలేరు" అని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. తనపై వచ్చే తీర్పులకు వ్యతిరేకంగా దేశమంతా 'లాక్‌డౌన్' తీసుకురావాలని ఆమె తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన విద్యార్థుల ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో.. హసీనాపై హత్య సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa