పాత వస్తువులను అమ్ముకోవడానికి, కొనడానికి ఉపయోగపడే ఓఎల్ఎక్స్లో ఏకంగా ఓ ప్రభుత్వ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఈ వింత ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫొటోను ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేసి, కేవలం రూ.20 వేలకే అమ్ముతానని ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రకటించడం సంచలనం రేపింది.వివరాల్లోకి వెళితే... గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓఎల్ఎక్స్లో పెట్టిన పోస్ట్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే గిద్దలూరు తహసీల్దార్ ఎం. ఆంజనేయరెడ్డి నిన్న అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీని గుర్తించారు. అనుమానితుడు హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకుని, తెలంగాణ పోలీసుల సహకారంతో నిన్న రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టి ఆకతాయి చేష్టలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa