ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంలలో ముందుగానే ఓట్లు వేయడం అసాధ్యం....ఆర్జేడీ విమర్శలను ఖండించిన ఈసీ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 08:36 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ సీనియర్ నాయకుడు జగదానంద్ సింగ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో ఎన్నికలు మొదలు కావడానికి ముందే.. వేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. పోలింగ్ ప్రారంభించడానికి ముందుగానే ఒక్కో ఈవీఎంలో 25 వేల ఓట్లను వేశారని జగదానంద్ సింగ్ పేర్కొనడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే బిహార్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. ఈవీఎంలపై ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 25 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇది బిహార్ ప్రజల తీర్పును సూచించడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ఆర్జేడీ పార్టీ.. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఇదే విషయంపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సోమవారం చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన జగదానంద్ సింగ్.. పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రతీ ఈవీఎంలో 25 వేల ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆర్జేడీ 25 సీట్లు గెలుచుకుందని తెలిపారు.


ఆర్జేడీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. జగదానంద్ సింగ్ చేసిన వాదన టెక్నికల్‌గా అసాధ్యమని.. ప్రక్రియపరంగా అవాస్తవమని కొట్టివేసింది. ఆర్జేడీ పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసిన చట్టబద్ధమైన రికార్డులే ఈ ఆరోపణలకు విరుద్ధంగా ఉన్నాయని ఈసీ స్పష్టం చేసింది. ఈవీఎంలకు వైఫై, బ్లూటూత్, ఇంటర్నెట్ లేదా మరే ఇతర ఎక్స్‌టర్నల్ కనెక్టివిటీ ఉండదని.. అందువల్ల వీటిని రిమోట్ లేదా డిజిటల్ ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని ఈసీ వెల్లడించింది.


పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందే.. ప్రతీ ఈవీఎం అన్ని బ్యాలెట్‌లను సున్నాగా చూపిస్తుందని.. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో తప్పనిసరిగా మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మాక్ ఓట్లన్నీ క్లియర్ చేసిన తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్‌పై అన్ని పార్టీల ఏజెంట్లతో సంతకాలు తీసుకుంటారు. ఏ ఈవీఎం ఏ బూత్‌కు వెళ్తుందో ఎవరూ ఊహించకుండా ఉండేందుకు.. ఈవీఎంలు రెండు దశల రాండమైజేషన్‌ చేస్తారని ఈసీ తెలిపింది. ప్రతీ ఈవీఎం వీవీప్యాట్ యూనిట్‌తో జత చేసి ఉంటుంది. ప్రతీ నియోజకవర్గంలో ర్యాండమ్ వీవీప్యాట్ ఓట్లను లెక్కించడం ద్వారా ఆడిట్ చేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల మధ్య ఎక్కడా ఓట్ల తేడా రాలేదని ఈసీ స్పష్టం చేసింది.


ఆర్జేడీ పార్టీకి పోలింగ్ ఏజెంట్లు మాక్ పోల్ సర్టిఫికేట్‌లు.. నమోదైన ఓట్ల వివరాలకు సంబంధించిన ఫారం 17సీ, సీలింగ్ డాక్యుమెంట్లపై ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తకుండానే సంతకాలు చేశారని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు, వాదనలు మాత్రం వాటికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ఈసీ తన ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa