ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరణశిక్ష పడిన షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా

national |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 08:51 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతుండగా.. షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినందున.. ఆమెను తమకు అప్పగించాలని.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షేక్ హసీనా అప్పగింత అంశం భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న హసీనాను వెంటనే తమకు అప్పగించాలని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం న్యూఢిల్లీని కోరింది.


2024 జూలైలో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు గాను.. హెలికాప్టర్లు, డ్రోన్‌లు, మారణాయుధాలను ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై షేక్ హసీనాకు ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం.. శిక్ష పడిన షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్‌లను అప్పగించడం న్యూఢిల్లీకి తప్పనిసరి బాధ్యత అని పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వకం కాని చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది.


భారత్ స్పందన


షేక్ హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పుపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తాము తీర్పును గమనించామని తెలిపింది. అయినప్పటికీ.. షేక్ హసీనాను అప్పగించాలనే ఢాకా డిమాండ్‌పై మాత్రం స్పందించలేదు. పొరుగు దేశంగా.. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం.. శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం ఉండేలా చూస్తామని తెలిపింది. ఈ లక్ష్యాలను సాధించడానికి తామను నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.


హసీనా అప్పగింత కష్టమేనా?


ప్రత్యర్పణ అభ్యర్థనలను సాధారణంగా గౌరవించినప్పటికీ.. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగించే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందం రెండూ మన దేశానికి చాలా వెసులుబాటును కల్పిస్తున్నాయి. ప్రత్యర్పణ ఒప్పందంలోని ఆర్టికల్ 8 ప్రకారం.. నిందితుడిపై ఉన్న అభియోగాలు అన్యాయమైనవి లేదా అణచివేతకు గురిచేసేవి అని నిరూపించగలిగితే.. అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. షేక్ హసీనాపై ఉన్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి కావచ్చనే కారణంతో భారత్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశం ఉంది.


ఆర్టికల్ 6 ప్రకారం.. హత్య, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలు మినహా రాజకీయ స్వభావం ఉన్న నేరాలకు నిందితులను అప్పగించడాన్ని తిరస్కరించవచ్చు. షేక్ హసీనాపై ఉన్న కొన్ని ఆరోపణలు దీని పరిధిలోకి రాకపోవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యర్పణ చట్టం 1962లోని సెక్షన్ 29 భారత ప్రభుత్వానికి రాజకీయ ప్రేరేపిత అభ్యర్థనలను.. న్యాయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అభ్యర్థనలను తిరస్కరించే అధికారాన్ని ఇస్తుంది.


షేక్ హసీనా స్పందన


ఇక తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై స్పందించిన షేక్ హసీనా ఇది రాజకీయ ప్రేరేపితమైన తీర్పు అని దాన్ని ఖండించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంపై భారత్ అంతర్జాతీయంగా, ద్వైపాక్షికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa