ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు మొత్తంగా రూ.3,135 కోట్ల రూపాయలు జమ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు కేంద్రం రూ.2,000, రాష్ట్రం రూ.5,000 చొప్పున మొత్తం రూ.7,000 లభిస్తుంది. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయగా, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి మండలం, చినదాసరిపల్లి గ్రామంలో మధ్యాహ్నం అన్నదాత సుఖీభవ నిధుల్ని విడుదల చేస్తారు. ఈ నిధుల కేటాయింపులో 70 శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని రైతులకు తప్పనిసరిగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవాలను లైవ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజక కేంద్రాలలో, రైతు సేవా కేంద్రాలలో ప్రసారం చేయాలని సూచించారు. అధికారులు కేవలం నిధుల విడుదలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా (తోటాపురి మామిడి, బర్లీ పొగాకు, ఉల్లి సాగు వంటి) ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మార్కెట్ సౌకర్యం పెంపు, భూసార పరీక్షలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు వంటి అంశాలపై రైతులకు అవగాహన పెంచడానికి గట్టి కృషి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమంలో డమ్మీ చెక్ లు తయారు చేయాలని, కార్యక్రమం జరిగిన తరువాత వారం రోజులపాటు ఔట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రతి రైతును సంప్రదించి డబ్బు జమపై ఆరా తీయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలను తెలియచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల సంఖ్య, అందుతున్న నగదు, అర్హతలు, పనిచేయని ఖాతాలు వంటి సమగ్ర వివరాలు అందుబాటులో ఉంచాలని కూడా అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa