ఏపీ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు. పెండ్లిమర్రి పర్యటనలో భాగంగా చంద్రబాబు మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని 47 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3200 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతుకు రూ.7000చొప్పున జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కాగా.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 అందిస్తోంది.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల నేపథ్యంలో.. రైతులు తమకు డబ్బులు అందాయో లేదో, ఏ బ్యాంకుకు పడ్డాయనే దానిపై స్టేటస్ చెక్చేసుకోవచ్చు. ఇందుకోసం https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్కు వెళ్లాలి. వెబ్సైట్లో Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు నంబర్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నంబరు, కాప్చా ఎంటర్ చేసిన తర్వాత..సెర్చ్ బటన్ నొక్కాలి. అనంతరం వివరాలు కనిపిస్తాయి. అర్హులై ఉంటే ఆ రైతు పేరు జిల్లా, మండలం, గ్రామం వివరాలు కనిపిస్తాయి. అలాగే పథకం స్టేటస్ గురించి సమాచారం అక్కడ ఉంటుంది.
రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేశారా, లేదాఅనే వివరాలు కూడా తెలుస్తాయి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు ఏ బ్యాంక్ ఖాతాలోకి పడ్డాయనే వివరాలు కూడా తెలుస్తాయి. మరోవైపు పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలివిడత కింద రూ.7000, రెండో విడత కింద రూ.7000 అందించారు. మూడో విడత కింద రూ.6000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2026 జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి నెలలో జమ చేసే అవకాశం ఉంది. ప్రతి నాలుగు నెలలకు ఓ సారి కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa