గుజరాత్ రాష్ట్రం, మెహసానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద 'చిల్లర' కోసం జనాలు బారులు తీరారు. తొమ్మిదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు రోజుల తరబడి బ్యాంకుల ముందు వరుసలు కట్టిన దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు మెహసానాలో పునరావృతమైంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు వెలుపల పొడవైన క్యూలు దర్శనమిచ్చాయి.వివిధ మీడియా కథనాల ప్రకారం, మెహసానా కోఆపరేటివ్ బ్యాంకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి కొత్తగా ముద్రించిన రూ. 10 నోట్లు, నాణేలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. ఉదయం నుంచి ప్రజలు వరుసలలో నిలబడ్డారు. స్థానిక వ్యాపారులు, ఇతర వర్గాల వారి డిమాండ్ మేరకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరతను పరిష్కరించే లక్ష్యంతో బ్యాంకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 14 లక్షల విలువైన రూ. 10 నోట్లు, కొంత మొత్తంలో రూ. 20 నోట్ల కట్టలు, అలాగే రూ. 3 లక్షల విలువైన రూ. 2, రూ. 5 నాణేలను బ్యాంకు పంపిణీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగిది. ప్రజలు తమ అవసరాల మేరకు చిల్లర తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్యాంకు మేనేజర్ ముఖేశ్ భాయ్ పటేల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa