అమెరికాలో ఎనిమిదేళ్ల కిందట హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్కు చెందిన శశికళ నర్రా, ఆమె కుమారుడి కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో శశికళ, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు.. తాజాగా అసలు నిందితుడ్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు.. తన భార్య శశికళ (40), కుమారు అనీష్ సాయి (7)తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉండేవారు. అయితే, 2017 మార్చి 23న శశికళ, సాయి అనూహ్యంగా హత్యకు గురయ్యారు. ఆఫీసు నుంచి హనుమంతరావు ఇంటికి వచ్చేసరికి.. వారు ఉంటోన్న మాపుల్ షేడ్లోని అపార్ట్మెంట్లో రక్తపు మడుగులో భార్య కుమారుడు విగతజీవిగా పడి ఉన్నారు.
దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, హనుమంతరావుపై శశికళ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. కేరళకు చెందిన ఓ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని, అడ్డుగా ఉన్నారని భార్యాబిడ్డలను హత్య చేశాడని ఆరోపించారు. దీంతో హనుమంతురావుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. దర్యాప్తులో అసలు హంతకుడు అతడు కాదని తెలిసింది. ఘటనా స్థలిలో లభించిన డీఎన్ఏతో హనుమంతరావు డీఎన్తో సరిపోలకపోవడంతో పోలీసులు విడుదల చేశారు.
అయితే, వారి ఇంటి సమీపంలో ఉండే సహోద్యోగి హమీద్తో హనుమంతురావు కుటుంబానికి విబేధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఈ హత్యలతో హమీద్కు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే, హత్యలు జరిగిన ఆరు నెలల తర్వాత అతడు భారత్కు తిరిగొచ్చేశాడు. దీంతో భారత్లోని హమీద్ను అమెరికా అధికారులు సంప్రదించి, డీఎన్ఏ నమూనా ఇవ్వాలని పలుసార్లు కోరారు. కానీ, హమీద్ వారి అభ్యర్థనను నిరాకరిస్తూ రావడంతో కేసు పురోగతి నిలిచిపోయింది. అయితే, ఎలాగైనా డీఎన్ఏను సేకరించి, కేసును చేధించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు హమీద్కు జారీచేసిన ల్యాప్టాప్ను పంపాలని గతేడాది అతడు పనిచేసిన కాగ్నిజెంట్ సంస్థను అమెరికా కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో కాగ్నిజెంట్ పంపిన ల్యాప్టాప్ నుంచి అధికారులు డీఎన్ఏ సేకరించి పరీక్షించారు. ఘటనా స్థలంలోని లభించిన డీఎన్ఏతో అది మ్యాచ్ కావడంతో హమీద్ను నిందితుడిగా తాజాగా అమెరికా పోలీసులు ప్రకటించారు. భారత్లో ఉన్న అతడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. అమెరికాకు తిరిగి అప్పగించాలని భారత విదేశాంగ శాఖను వారు కోరారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హమీద్ను విచారిస్తే గానీ ఏంటి? అనేది బయటపడుతుంది. హనుమంతురావుపై పగ తీర్చుకోవడానికే అతడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa