వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.. తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని.. కానీ వారి ఏడుపులే వైయస్ జగన్కి ప్రజా దీవెనులుగా మారుతున్నాయని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకాబోతూ అందుకు షెడ్యూల్ని విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైమిచ్చారంటూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా నిబంధనల ప్రకారం ఆయన ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఎల్లో మీడియా, కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అణువంత కూడా తగ్గించలేరని బదులిచ్చారు. చంద్రబాబుకి చేతనైతే ఎన్నికల వాగ్ధానాలను అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. సొంత డబ్బుతో అద్దెకు తెచ్చుకున్న ఫ్లైట్లో వైయస్ జగన్ కోర్టుకి వెళితేనే బురదజల్లిన ఎల్లో మీడియాకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రజల సొమ్ముతో వారం వారం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa