బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్డీయే అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి నితీశ్ ఏకైక కుమారుడు నిశాంత్ కూడా హాజరయ్యారు. రాజకీయాలకు, ప్రచారానికి దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా తొలిసారి మీడియాతో మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయన మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై నిశాంత్ హర్షం వ్యక్తం చేశారు. "ఈ విజయాన్ని అందించిన ప్రజలకు, దేవుడికి కృతజ్ఞతలు. గత ఎన్నికల్లో మాకు 43 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా నాన్న నిరంతరం ప్రజల కోసం పనిచేశారు. ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు" అని నిశాంత్ పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలుపొందగా, జేడీయూ గతంలో కంటే రెట్టింపు స్థానాలతో 85 సీట్లు దక్కించుకుంది.ఎన్డీయే ఘన విజయంలో మహిళల పాత్ర కీలకమని నిశాంత్ అన్నారు. తన తండ్రి రెండు దశాబ్దాల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ఈ గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ, ఎల్జేపీ (రామ్ విలాస్) వంటి మిత్రపక్షాల నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa