మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తాజా ఎన్కౌంటర్ల ద్వారా తమ నాయకత్వంపై జరుగుతున్న వేటను తీవ్రంగా ఖండించింది. పార్టీ అధికార ప్రతినిధి ‘అభయ్’ పేరుతో విడుదల చేసిన లేఖలో, ఛత్తీస్గఢ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను పూర్తిగా రాజకీయ హత్యాకాండగా అభివర్ణించింది. ఈ ఘటనలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, ప్రముఖ మిలిటరీ నేత హిడ్మా (మడ్కం హిడ్మే) మరణించినట్టు పోలీసులు చెబుతున్నా, అది నిజం కాదని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.
అభయ్ లేఖ ప్రకారం, హిడ్మా గాయం నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకుంటూ సాధారణ గ్రామస్తులతో కలిసి ఉండగా, ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. నిరాయుధుడిగా, సామాన్య వ్యక్తిలా ఉన్న హిడ్మాను సహా మరో 30 మంది కార్యకర్తలను కాల్చి చంపారని పార్టీ ఆరోపించింది. “ఇది ఎన్కౌంటర్ కాదు, ప్రణాళికాబద్ధమైన ఊచకోత” అని లేఖలో పేర్కొంది.
ప్రభుత్వ బలగాలు తమ ఓటములను దాచడానికి, ప్రజల్లో భయం నింపడానికి ఇలాంటి కట్టుకథలు సృష్టిస్తున్నాయని మావోయిస్టు కేంద్ర కమిటీ మండిపడింది. హిడ్మా మరణంతో పార్టీకి తీరని నష్టం కలిగినా, పోరాటం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించింది. ఈ దమనకాండను అడ్డుకోవాలని ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు స్పందించాలని పిలుపునిచ్చింది.
ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా ‘నిరసన దినం’గా పాటించాలని, బంద్లు, ర్యాలీలు, సమ్మెలతో ప్రతిఘటన తెలపాలని మావోయిస్టు పార్టీ తన కార్యకర్తలకు, అనుభవజ్ఞులకు, ప్రజలకు ఆదేశించింది. హిడ్మా హత్య కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa