మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూశారా.. అయితే మీకు బటర్ ఫ్లై ఎఫెక్ట్ తెలిసే ఉంటుంది. ఎక్కడో జరిగిన ఓ ఘటన.. మరెక్కడో జరగబోయే మరో ఘటనకు కారణమవుతుందనేది ఈ థియరీ చెప్పే సిద్ధాంతం. ఇప్పుడా బటర్ ఫ్లై ఎఫెక్ట్ సంగతి ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది మరి. సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే పర్యాటకులకు పండగేనని చెప్పొచ్చు. వర్షాకాలం పూర్తై.. శీతాకాలం వచ్చేసరికి ప్రకృతి సరికొత్త అందాలు సంతరించుకుని ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను చూడ్డానికి సందర్శకులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఏపీలో ఇటీవలి కాలంలో జరిగిన రెండు ఎన్కౌంటర్లు.. మారేడుమిల్లి ప్రాంతానికి సందర్శకులు తగ్గిపోవడానికి కారణమయ్యాయి.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల రెండు వరుస ఎన్కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పులలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా హతమయ్యాడు. వరుసగా రెండు రోజుల వ్యవధిలో రెండు భారీ ఎన్కౌంటర్లు జరగటంతో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతం ఇప్పుడు భయం భయంగా గడుపుతోంది. సందర్శకులతో సందడిగా ఉండే మారేడుమిల్లి.. ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలబోతోంది.అందమైన అడవులు, జలపాతాలకు మారేడుమిల్లి ప్రాంతం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో పలు సినిమాలు, సీరియల్స్ షూటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ట్రెక్కింగ్, వ్యూపాయింట్స్ వంటి వాటితో పాటుగా గిరిజన సంస్కృతిని అద్దం పడుతుంది మారేడుమిల్లి ప్రాంతం.
అయితే ఎన్కౌంటర్ల తర్వాత ఈ ప్రాంతమంతా భయం గుప్పిట్లో గడుపుతోంది. పర్యాటకులు మారేడుమిల్లి సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. రిసార్ట్ బుకింగ్లను రద్దు చేసుకుంటున్న పరిస్థితి. శీతాకాలంలో సాధారణంగా మారేడుమిల్లి ప్రాంతాన్ని సందర్శించేందుకు రోజుకు పదివేల మంది వరకూ వస్తుంటారని అంచనా. అయితే ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పడిపోయిందని స్థానికులు, వ్యాపారులు చెప్తున్నారు. రాజమహేంద్రవరానికి సుమారుగా 90 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి ఉంటుంది. 71 గ్రామాలు మారేడుమిల్లి మండలం పరిధిలో ఉన్నాయి.
గుడిస శిఖరంతో పాటుగా సోకులేరు వాగు, మన్యం వ్యూపాయింట్, పొల్లూరు, అమృతధార, జలతరంగిణి, రాపా వంటి జలపాతాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అలాగే భూపతిపాలెం రిజర్వాయర్ చూడ్డానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ లభ్యమయ్యే బ్యాంబూ చికెన్ మరో స్పెషల్ అట్రాక్షన్. నవంబర్- ఫిబ్రవరి నెలల మధ్యన మారేడుమిల్లి ప్రాంతాన్ని చూడటానికి పర్యాటకులు భారీగా వస్తుంటారు. అయితే ఈ సమయంలోనే ఎన్కౌంటర్లు జరగటంతో పర్యాటకులు తమ మారేడుమిల్లి పర్యటనలను రద్దు చేసుకుంటున్నట్లు రిసార్ట్స్ సిబ్బంది చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa