ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన ఫారెస్ట్ అధికారి

Crime |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 08:46 PM

వివాహేతర సంబంధం.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఇద్దరు పిల్లలతో చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అంటూ.. వారి లైఫ్ సాగుతుండగా.. వివాహేతర సంబంధం కారణంగా ఆ ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోయింది. పెళ్లి అయి.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ ఫారెస్ట్ అధికారి.. సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిని అతి దారుణంగా కడతేర్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన భార్య ఫోన్ నుంచి తనకే మెసేజ్ పంపించుకున్నాడు. చివరికి పోలీసుల విచారణలో అతడే హంతకుడు అని తేలింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది.


భావ్‌నగర్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్)గా పనిచేస్తున్న.. 39 ఏళ్ల శైలేష్ ఖంభ్లా.. తన భార్య 40 ఏళ్ల నయన, కుమార్తె 13 ఏళ్ల ప్రీత.. కుమారుడు 9 ఏళ్ల భవ్యలను దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులకు విస్మయం కలిగించే విషయాలు వెల్లడి అయ్యాయి. వారిని హత్య చేసి.. ఇంటి వెనుక గుంటలో పూడ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేశారు.


అక్రమ సంబంధమే కారణం


అతడిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు శైలేష్ ఖంభ్లా.. గత 4 ఏళ్లుగా తన సహోద్యోగి అయిన ఒక మహిళా ఫారెస్ట్ వర్కర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ విషయంలో ఆ మహిళ పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఇప్పటికి స్పష్టంగా తెలియకపోయినా.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


శైలేష్ ఖంభ్లా.. ఇటీవలే భావ్‌నగర్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కానీ ఆయన భార్య, పిల్లలు మాత్రం సూరత్‌లోనే నివసిస్తున్నారు. సెలవుల కోసం వారు భావ్‌నగర్‌కు రాగా.. ఈ దారుణం చోటు చేసుకుంది. వారి కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. శైలేష్ ఖంభ్లా భార్య నయన.. సూరత్‌లో తన అత్తమామలతో కలిసి ఉండడం ఇష్టం లేక.. భావ్‌నగర్‌లోనే భర్తతో కలిసి ఉందామని ఒత్తిడి తీసుకువస్తూ వచ్చింది. దీనికి తన భర్త అంగీకరించకపోవడంతో వీరి మధ్య గొడవలు పెరిగాయి.


అయితే ఈ వివాదాలే హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య, పిల్లలను దిండుతో అదిమి హత్య చేసినట్లు నిందితుడు శైలేష్ ఖంభ్లా పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈనెల 2వ తేదీన శైలేష్ ఖంభ్లా తన జూనియర్ అధికారి గిరీష్ వానియాను ఇంటికి పిలిపించి.. చెత్తను పారేయడానికి రెండు గుంటలు తవ్వాలని చెప్పాడు.


ఇక వారిని హత్య చేసిన తర్వాత.. ఖంభ్లా తన భార్య ఫోన్ నుంచి తనకే.. తాను వేరే వ్యక్తితో వెళ్లిపోతున్నట్లు మెసేజ్ పంపుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీన.. తన భార్య, పిల్లలు ఆటోలో వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ గార్డు చూసినట్లు ఖంభ్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ.. సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నించగా.. అతడు ఆ విషయాన్ని ఖండించడంతో పోలీసులకు ఖంభ్లాపై అనుమానం పెరిగింది.


తవ్విన గుంటలను పూడ్చేందుకు డంపర్ ట్రక్కును పంపించాలని నవంబర్ 6వ తేదీన వానియాను ఖంభ్లా కోరాడు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన ఖంభ్లా ప్రవర్తన.. కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులకు అతడిపై అనుమానం మరింత బలపడింది. దీంతో వారి ఇంటి వెనుక ఉన్న ఆ గుంటలను తవ్వి చూడగా.. అందులో అతడి భార్య, పిల్లల మృతదేహాలు లభించాయి. వెంటనే శైలేష్ ఖంభ్లాను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa