వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తప్పించారు. శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం రోజు ఆదేశాలు జారీ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వు్లు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు శంకరయ్య ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరువుకు నష్టం కలిగించారంటూ సెప్టెంబర్ నెలలో మాజీ సీఐ శంకరయ్య.. చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా శంకరయ్య ఉన్నారు.
మరోవైపు అసెంబ్లీలో వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని వివరిస్తూ.. సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి సీఐ శంకరయ్య పేరును గతంలో ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపివేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆరోపణలను తోసిపుచ్చిన శంకరయ్య.. చంద్రబాబు తన పరువుకు భంగం కలిగించారంటూ.. సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపారు.అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని శంకరయ్య తన లీగల్ నోటీసులలో డిమాండ్ చేశారు. అయితే వీఆర్లో ఉన్న ఓ సీఐ స్థాయి అధికారి.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లీగల్ నోటీసు పంపించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే శంకరయ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు 2019 మార్చి 15న వైఎస్ వివేకా హత్య జరిగింది. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంతింట్లోనే దారుణంగా హత్య చేశారు. అయితే ఆ సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య.. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలోని ఆధారాలను చెరిపివేస్తున్నా అడ్డుకోలేదని చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పదేపదే చేస్తున్న ఈ వ్యాఖ్యలే తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు.
29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తున్నానని.. 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే కోటి 45 లక్షల రూపాయలు పరువు నష్టం దావా వేస్తామంటూ లాయర్ ద్వారా శంకరయ్య నోటీసులు పంపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa