ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాది దాటితే గ్రాట్యుటీ.. 7వ తేదీలోపే శాలరీ.. కొత్త లేబర్ కోడ్స్‌లో మార్పులివే

business |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 10:32 PM

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తూ కేంద్రం ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ (కార్మిక స్మృతులు) నోటిఫై చేసింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 పాత కార్మిక చట్టాల స్థానంలో వీటిని రూపొందించింది. దేశవ్యాప్తంగా తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కార్మిక చట్టాల విషయంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణలు ఉద్యోగుల భద్రత, సామాజిక భద్రత, మహిళా సాధికారత, సమాన వేతనాలు సహా అసంఘటిత రంగ కార్మికులకు ప్రధానంగా గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు రక్షణ కల్పించడంలో కీలక మైలురాయిగా చెప్పవచ్చు.


కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చిన క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. కొత్త చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి చేసింది. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వకంగా హామీ లభిస్తుందని కేంద్రం పేర్కొంది. అలాగే గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత పథకాలైన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐసీ, బీమా వంటివి కల్పంచాల్సి ఉంటుంది.


ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఇకపై శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది.


ఎఫ్‌టీఈ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు బదులుగా కేవలం 1 ఏడాది సర్వీస్ పూర్తయిన తర్వాతే గ్రాట్యుటీకి అందించాలి.


కార్మికులు అందరికీ కనీస వేతనం అనేది చట్టబద్ధమైన హక్కుగా మారింది.


కంపెనీల యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి.


ఐటీ ఉద్యోగులకు నెలలో 7వ తేదీ లోపు వేతనాలు చెల్లించాల్సిందే.


బీడీ, సిగరెట్, మైనింగ్ పరిశ్రమల్లో పని చేసే వారు 8-12 గంటల వరకు పని చేయొచ్చు. వారానికి 48 గంటలు మించకూడదు. 30 రోజుల పని పూర్తి చేసుకున్నట్లయితే బోనస్ పొందేందుకు అర్హత లభిస్తుంది.


40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి.


సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. సంస్థలో ట్రాన్స్‌జెండర్ సహా లింగ వివక్ష చట్టబద్ధంగా నిషేధం.


సాధారణ పని గంటలు దాటి పని చేసినట్లయితే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.


రాత్రి షిప్టుల్లో, అన్ని రకాల పనుల్లోనూ (అండర్ గ్రౌండ్ మైనింగ్ సహా) మహిళలకు అనుమతి. అయితే, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి, మహిళల సమ్మతి తప్పనిసరి.


మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు చోటు. దీంతో డిపెండెంట్ కవరేజీ పెరుగనుంది.


గిగ్ వర్క్, ప్లాట్ ఫామ్ వర్క్, అగ్రిగేటర్స్‌కు కార్మిక చట్టంలో తొలిసారి నిర్వచనం.


ఉబర్, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2 శాతం సామాజిక భధర్త నిధికి కేటాయించాలి. కార్మికులకు చెల్లించే మొత్తంలో గరిష్ఠంగా 5 శాతం వరకు చెల్లించొచ్చు.


ఆధార్ లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు అనేవి రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa