కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు.. ఏటా కేంద్రం కరవు భత్యం, డియర్నెస్ రిలీఫ్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఏటా రెండు సార్లు సవరించాల్సి ఉంటుంది. దీని కోసం వేతన సంఘం సిఫార్సుల్ని ప్రాతిపదికలోకి తీసుకుంటారు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ ఎక్కువగా పెంచుకుంటూ పోతుంటుంది. సాధారణంగా ఏటా జనవరి, జులైల్లో వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. కానీ.. సాధారణంగా కాస్త ఆలస్యంగా మార్చిలో హోలీ సమయంలో ఒకసారి, తర్వాత దీపావళి సందర్భంగా అక్టోబర్/నవంబరులో వీటిని పెంచుతుంటుంది. ఎప్పుడు పెంచినా కూడా అమలు చేసేది మాత్రం జనవరి 1, జులై 1 నుంచే అమల్లోకి వస్తుంటాయి. ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉంది. దీంతో మళ్లీ పెంపు కోసం వీరు ఎదురుచూస్తున్నారు.
అయితే ఇక్కడే ఉద్యోగుల్లో గందరగోళం తలెత్తుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం.. గడువు ఈ డిసెంబర్ 31తో ముగుస్తుంది. తర్వాత 8వ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఇది ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. విధివిధానాల ఆమోదానికి దాదాపు 10 నెలలు పట్టింది.
ఇప్పటినుంచి సిఫార్సులు చేయడం ప్రారంభించినా దాదాపు 18 నెలల వరకు సమయం పట్టనుంది. తర్వాత దీనికి కేంద్రం ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఎలాగోలా ఇది అమలయ్యేందుకు దాదాపు 2 సంవత్సరాలు పట్టొచ్చని అంతా భావిస్తున్నారు. ఇక్కడే.. అసలు 8వ వేతన సంఘం వచ్చే వరకు.. 7వ వేతన సంఘం కింద డీఏ, డీఆర్ పెరుగుతాయా లేదా అనే ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడ కేంద్రం వచ్చే ఏడాది తొలి సైకిల్లో డీఏ పెంపు గురించి ఏమైనా ప్రకటన చేస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘం గడువు ముగిశాక కూడా ఆ సిఫార్సులు అమల్లోకి వస్తాయా రావా అని తెలియక 1.20 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు సతమతమవుతున్నారు. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాక ఏమైనా మారుతుందా.. ఇందులో తేడా ఉంటుందా అని చూస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే.. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు పాత వేతన సంఘం సిఫార్సులు అమల్లోనే ఉంటాయి. కాబట్టి.. దీని గురించి అంత కంగారు పడాల్సిన పని లేదని చెబుతున్నారు. ఇంకా డీఏ 50 శాతం దాటింది కాబట్టి.. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఇది బేసిక్ పేలో విలీనమై డీఏ మళ్లీ సున్నా నుంచి స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa