ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ రేటు ఎంత..?

business |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 10:48 PM

భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని ఇతర దేశాల మధ్య సంఘర్షణ ఇలా ఇవన్నీ.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా మరింత డిమాండ్ పెంచింది. దీంతో ఇటువైపు విపరీతంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. దీనికి అదనంగా కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ.. తమ నిల్వల్ని పెంచుకున్నాయి. దీంతో.. బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 65 శాతానికిపైగా పెరిగాయి. కొనుగోలు చేసేందుకు సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. ఆ మధ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ రికార్డు గరిష్టాల దిశగా పరుగులు తీశాయి.


గత 4 రోజుల్లో కూడా విపరీతంగా బంగారం ధర పెరగ్గా.. ఇప్పుడు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తదుపరి సమీక్షలో తగ్గిస్తుందన్న అంచనాలతో రేటు పెరగ్గా.. గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే ఇన్వెస్టర్లు లాభాల్ని సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించగా రేటు దిగొచ్చింది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ డిమాండ్ కూడా పెరగ్గా.. బంగారం ధర తగ్గేందుకు ఇది మరో కారణంగా నిలిచింది.


 దేశీయంగా చూస్తే ప్రముఖ జువెల్లరీల్లో బంగారం ధర తగ్గింది. లలితా జువెల్లరీలో గ్రాము బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 55 తగ్గి గ్రాముకు మంగళవారం సాయంత్రం 7 గంటలకు రూ. 11,905 గా ఉంది. అంటే తులం రూ. 1,19,050 గా ఉంది. దీనికి ముందు రూ. 11,960 గా ఉండేది. టాటా ప్రొడక్ట్ తనిష్క్‌లో చూస్తే ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ. 11,975 గా ఉంది. ఖజానా, మలబార్ గోల్డ్, కల్యాణ్ జువెల్లర్స్, జోయాలుక్కాస్‌లో బంగారం ధర గ్రాముకు ప్రస్తుతం రూ. 11,905 వద్దే ఉంది.


ఇక్కడ బంగారం ధర ఇలా ఉన్నా.. ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు ఈ ఛార్జీలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక్కడ తుది బిల్లుపై 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. అదనంగా బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. ఇది షాపుల్ని బట్టి.. గోల్డ్ జువెల్లరీ డిజైన్‌ను బట్టి మారుతుంటుంది. ఈ మేకింగ్ ఛార్జీలపైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. అందుకే.. కొనుగోలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,205 డాలర్ల స్థాయిలో ట్రేడవుతుండగా.. సిల్వర్ రేటు 57.50 డాలర్ల వద్ద ఉంది.


డిసెంబర్ 9-10 తేదీల్లో యూఎస్ ఫెడ్ సమావేశం కానుండగా.. వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు దాదాపు ఖరారైంది. ఇదే జరిగితే.. బంగారం ధర మరింత పెరుగుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ సహా యూఎస్ డాలర్‌పై రాబడి తగ్గుతుంది. దాంతో సాధారణంగానే బంగారం ధర పెరుగుతుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa