ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంట్ ఛార్జీలను పెంచడం లేదని.. సీఎం క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 07:34 PM

సగటు మధ్య తరగతి జీవికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. కరెంట్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం కూడా తగ్గిపోయిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు.


18 నెలల పాలనలో.. 93 పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించినట్లు చంద్రబాబు వివరించారు. విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే విద్యుత్ వ్యవస్థను నిలబెట్టామన్న చంద్రబాబు.. కరెంట్ ఛార్జీలను పెంచబోమని ప్రకటించారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని.. పరిశ్రమలను వెళ్లగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు వివరించారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామన్న చంద్రబాబు.. గత పాలనలో డ్రాపవుట్ల సంఖ్య ఎక్కువగా ఉండేదని విమర్శించారు.


మరోవైపు 18 నెలల పాలనలో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ పెంచామని.. టెక్నాలజీ సాయంతో సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరగడమే.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందనడానికి నిదర్శనమని వివరించారు. వైసీపీ పాలనలో మూలధన వ్యయం చేయకపోవడంతో ప్రాజెక్టులు ముందుకెళ్లలేదని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలను ప్రజల చేతుల్లోకి తీసుకెళ్లినట్లు వివరించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 13.5 శాతంగా ఉండేదన్న చంద్రబాబు.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ వృద్ధి రేటు 10.32 శాతానికి పడిపోయిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించామని.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. సీఐఐ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa