ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..సైలెంట్‌‌గా ప్రైవేటీకరణ.. షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 07:47 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంగిద్ధం నెలకొంది. ఓవైపు కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అధికార పక్షంపై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్న కేంద్రం.. నెమ్మదిగా అదానీ చేతిలో పెడుతోందని ఆరోపించారు. ఎక్స్ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.


"అమ్మేది లేదంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ గౌతమ్ అదానీ చేతిలో పెడుతున్నారు. విస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని, అమ్మబోమని, ఆదుకుంటామని బీజేపీ చెప్పేవన్నీ ఉత్తి కబుర్లు మాత్రమే. తెరముందు గొప్పలు చెప్పుకుంటూ.. తెరవెనుక అదానీ కోసం స్కెచ్చులు వేస్తున్నారు. విశాఖ స్టీల్‌పై ప్రధాని మోదీది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. అందుకే ఉద్యోగులను తీసేస్తున్నారు. కొత్త నియామకాలు చేపట్టకుండా అడ్డుకున్నారు. అడ్డికి పావుసేరు లెక్కన.. స్టీల్ ప్లాంట్ భూములను అదానీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు ఉరి పెడుతున్నారు. ఒక్కొక్కటిగా అదానీకి అన్ని అప్పగిస్తూ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్ గా మార్చాలని చూస్తున్నారు" అని షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.


'సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు..'


"విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే కుట్ర మోదీదైతే, దాన్ని అమలు చేస్తున్నది సీఎం చంద్రబాబు. ఒక చేత్తో సాయం అని చెప్పి.. మరో చేత్తో లాక్కుంటున్నారు. పొమ్మనకుండా పొగపెట్టిన చందాన.. నష్టాల సాకు చూపి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను వేధిస్తున్నారు. పనికొద్ది జీతమని ప్రపంచంలో లేని రూల్స్‌ను పెడుతున్నారు. టెండర్ల పేరుతో ముక్కలు చేసి విడిభాగాలుగా అమ్మకానికి పెడుతున్నారు. ఈ ప్రక్రియలో ప్రతి అడుగూ ఆదానీకి చేతిలో పెట్టడానికి వేస్తున్నారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు" అంటూ ధ్వజమెత్తారు షర్మిల


'ప్రధాని ప్రకటన చేయాలి.. '


విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే.. తెలుగు వారి ఆత్మగౌరవం మీద గౌరవముంటే, అదానీకి కట్టబెట్టే ఆలోచనే లేకుంటే.. వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేది లేదని చెప్పాలన్నారు. విశాఖ స్టీల్‌కు సొంతగా గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ స్టీల్‌ను ఎస్ఏఐఎల్‌లో విలీనం చేస్తున్నట్లు హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని అధికార కూటమికి చెందిన ఎంపీలకు దమ్ముంటే.. ప్రధానితో ఈ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa