ఉత్తర ప్రదేశ్లో అక్రమ వలసదారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర భద్రత, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో అక్రమ వలసదారులపై నిర్ణయాత్మక చర్యలు ప్రారంభించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎవరినైనా పనిలో నియమించుకునే ముందు వారి గుర్తింపును తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ముఖ్యమంత్రి పౌరులకు విజ్ఞప్తి చేశారు. అక్రమ వలసదారుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ ఉటంకించారు.
ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి చొరబడిన వారికి రెడ్ కార్పెట్ వేయలేమని సుప్రీం కోర్టు చెప్పినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం లభించదనే విషయం సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. దేశ వనరులు పౌరులకు మాత్రమే చెందుతాయని.. అక్రమ వలసదారులకు కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో భద్రత, సామాజిక సమతుల్యతను, బలమైన శాంతిభద్రతల వ్యవస్థను కొనసాగించడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని అన్నారు.
ముఖ్యంగా ఎక్స్ వేదికగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ పోస్టు పెట్టారు. అందులోనే ఈ విషయాలను ప్రస్తావించారు. అద్దెదారులు, చిరు వ్యాపారులు, ఇంట్లో పని చేసేవారు వంటి వారెవరినైనా నియమించుకునే ముందు వారి గుర్తింపు పత్రాలను సరి చూసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "రాష్ట్ర భద్రత అనేది మనందరి ఉమ్మడి బాధ్యత. ఎందుకంటే భద్రతే శ్రేయస్సుకు మూలం" అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యా, బంగ్లాదేశీయుల పట్ల కఠిన చర్యలు ప్రారంభం అయ్యాయని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందాల్సిన ప్రయోజనాలు అక్రమ వలసదారుల పాలు కాకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేక పత్రాల ధృవీకరణ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులను గుర్తించి, తదుపరి చర్యల కోసం డిటెన్షన్ కేంద్రాలకు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రతి డివిజన్లో డిటెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa