ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాంఘైలో భారత కాన్సులేట్ కొత్త భవనం ప్రారంభం

international |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 09:08 PM

చైనాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన షాంఘైలో భారతదేశం తన కొత్త అత్యాధునిక కాన్సులేట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించింది. గత 32 ఏళ్లలో చైనాలోని ఈ వ్యాపార కేంద్రంలో భారత్ కాన్సులేట్‌ను తరలించడం ఇదే తొలిసారి. చాంగ్నింగ్ జిల్లాలోని ప్రముఖ డాన్వింగ్ సెంటర్‌లో విస్తరించిన ఈ కొత్త భవనం 1,436.63 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పాత భవనంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ అత్యాధునిక భవనాన్ని చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే కాన్సులేట్ కార్యకలాపాలు డిసెంబర్ 8వ తేదీ (సోమవారం) నుంచి ఈ కొత్త ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి.


భారత్-చైనా దౌత్య సంబంధాలు ప్రారంభం అయ్యి ఆదివారంతో 75 ఏళ్లు కాగా.. ఈ కొత్త భవనం ప్రారంభోత్సవం ప్రత్యేకత సంతరించుకుందని రాయబారి రావత్ తెలిపారు. షాంఘైతో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలకు ఈ ప్రపంచ స్థాయి కాన్సులేట్ జనరల్ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ మాట్లాడుతూ.. కొత్త భవనం ద్వారా భారతీయ పౌరులకు, చైనా భాగస్వాములకు మెరుగైన, నిరంతరాయ సేవలు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.


ఈ విస్తరణ వల్ల కాన్సులర్, వాణిజ్య, సాంస్కృతిక, పరిపాలనా విధులను ఒకే సురక్షితమైన, ఆధునిక అంతస్తులో నిర్వహించడానికి వీలవుతుందన్నారు. ఇది సేవల్లో సామర్థ్యాన్ని పెంచి, ప్రజా సేవలను మెరుగుపరుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ కాన్సులేట్ భవనం హోంగ్‌కియావో–గూబీ విదేశీ వ్యాపార కారిడార్‌లో ఉండటం వ్యూహాత్మకంగా చాలా ప్రయోజనకరమని మాథుర్ తెలిపారు. భారత్-షాంఘైల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైన సమయంలోనే ఈ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు.


ఇది వాణిజ్యం, ప్రయాణం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాథుర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా "మనం ఈ అందమైన కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నప్పుడు.. ఈ భవనాన్ని కేవలం కార్యాలయంలా కాకుండా భారత్, తూర్పు చైనా ప్రాంతం మధ్య స్నేహం, వాణిజ్యం, సంస్కృతి, ప్రజల సంబంధాలకు శక్తివంతమైన కేంద్రంగా మారుద్దాం" అని మాథుర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రారంభోత్సవానికి దౌత్యవేత్తలు, షాంఘై మునిసిపల్ ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ నగరాల నుంచి భారతీయ ప్రవాసులు సహా 400 మందికి పైగా అతిథులు హాజరు అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa