ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ మంత్రి సోదరుడు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 08:34 PM

మధ్యప్రదేశ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి ప్రతిమా బగ్రీ సోదరుడు అనిల్ బగ్రీని గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలపై సత్నా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పంకజ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పోలీసులు దాదాపు 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.9.22 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


మధ్య ప్రదేశ్‌లోని మరున్హా గ్రామానికి చెందిన పంకజ్ సింగ్ నివాసంలో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వీరు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఈక్రమంలోనే వరి బస్తాల మధ్య ఉన్న 48 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పంకజ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఆపై అతడిని విచారించగా... మంత్రి ప్రతిమా బగ్రీ సోదరుడు అనిల్ బగ్రీ, బావ శైలేంద్ర సింగ్ రాజవత్‌లే తనకు ఈ గంజాయి పొట్లాలు అందజేసినట్లు పంకజ్ సింగ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు వెంటనే మంత్రి సోదురుడు అనిల్ బగ్రీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే శైలేంద్ర సింగ్ రాజవత్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. అతడు తప్పించుకున్నాడు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్‌ కోసం శైలేంద్ర సింగ్ రాజవత్ వాహనాన్ని ఉపయోగించినట్లు కూడా పోలీసులు తమ దర్యాప్తులో తెలుసుకున్నారు.


అనిల్ బగ్రీ అరెస్టు కావడానికి కొద్ది నెలల ముందే.. మంత్రి ప్రతిమా బగ్రీ బావ శైలేంద్ర సింగ్ ఉత్తర ప్రదేశ్‌లోని బందాలో 10.5 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. అంతేకాకుండా ఒక ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కొని బందా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కొంత కాలానికే విడుదల అయ్యాడు. అయితే అంతకుముందు కూడా రూ.5.5 కోట్ల విలువైన మత్తు కాఫ్ సిరప్ స్మగ్లింగ్ కేసులో సత్నాలో అరెస్టు అయ్యాడు. మంత్రి సోదరుడు, బావ వరుసగా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడంతో మంత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సర్కారు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఖజురహోలో జరిగిన సమీక్షా సమావేశంలో విలేకరులు మంత్రి ప్రతిమా బగ్రీని ఆమె సోదరుడి అరెస్టు గురించి ప్రశ్నించగా.. ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరెందుకు దీని గురించి అనవసరంగా మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. "స్మగ్లింగ్ కేసులో తన సోదరుడిని అరెస్ట్ చేస్తే మంత్రిగారు చూపించిన కోపాన్ని చూడండి. బీజేపీ ప్రభుత్వంలో మంత్రుల బంధువులు బహిరంగంగా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు" అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మరోవైపు అనిల్ బగ్రీ, పంకజ్ సింగ్‌లపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి.. 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి సెంట్రల్ జైలుకు పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa