గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ అనే పేరు.. వైసీపీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా పనిచేసిన కొడాలి నాని.. విపక్షంపై ఓ రేంజులో విరుచుకుపడేవారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొడాలి నాని.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొడాలి నాని. గత 18 నెలలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. ఆయన మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కొడాలి నాని రాజకీయాలకు దూరం అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అవి రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది.
అయితే 18 నెలలుగా రాజకీయాలకు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కొడాలి నాని.. చాలా రోజుల తర్వాత వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కోటి సంతకాల పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాని .. తొలిసారిగా పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కొడాలి నాని.. రాజకీయాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. బైపాస్ సర్జరీ తర్వాత వైద్యులు విరామం తీసుకోవాలని సూచించడంతో రెస్ట్ తీసుకున్నట్లు కొడాలి నాని వెల్లడించారు. మరో ఆరు నెలలు చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటానన్న కొడాలి నాని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఏపీలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని కొడాలి నాని వివరించారు. ఐదు కాలేజీల నిర్మాణం వైసీపీ హయాంలోనే పూర్తైందని.. మరో ఐదు కాలేజీల నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. ఇలాంటి సమయంలో పేద విద్యార్థులు, పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని కొడాలి నాని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను అడ్డుకునేందుకు వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. తాము సేకరించిన వినతి పత్రాలను గవర్నర్కు అందజేస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa