ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో ఓటర్ల జాబితా నుంచి 97 లక్షల మంది పేర్లు తొలగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 08:03 PM

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్).. తీవ్ర దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపట్టి.. భారీ సంఖ్యలో ఓటర్ల జాబితాలో నుంచి పేర్లను తొలగించిన ఈసీ.. ఈసారి తమిళనాడులో 97 లక్షల ఓటర్ల పేర్లను తీసేసింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది.


తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 97 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. గతంలో 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య.. ఈ ప్రక్షాళన తర్వాత 5.43 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. అయితే ఇందులో మరణించినవారు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిన వారు, రెండు చోట్ల పేర్లు నమోదైన వారు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సుమారు 27 లక్షల మంది మరణించిన వారితోపాటు.. వేరే ప్రాంతాలకు లేదా రాష్ట్రాలకు వలసపోయిన వారు 66 లక్షల మంది.. రెండు చోట్ల పేర్లు నమోదైన వారు 3.4 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.


తమిళనాడు రాజధాని చెన్నై, ఇండస్ట్రియల్ హబ్ అయిన కోయంబత్తూరులో అత్యధికంగా పేర్లు తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో మొత్తం 14.25 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించగా.. అందులో 12 లక్షల మంది ఇళ్లు మారిన వారు ఉన్నారు. ఇక కోయంబత్తూరులో 6.5 లక్షల మంది పేర్లు తొలగించగా.. అక్కడ మెజారిటీ స్థానాల్లో ప్రస్తుతం ప్రతిపక్షాల చేతిలో ఉన్నాయి. డీఎంకే, దాని మిత్రపక్షాల బలం ఉన్న ప్రాంతమైన కాంచీపురంలో 2.74 లక్షల ఓట్లను తొలగించారు. మరోవైపు.. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య హోరాహోరీ పోరు ఉండే జిల్లా అయిన దిండిగల్‌లో 2.34 లక్షల పేర్లను తీసేశారు. సినీ నటుడు, తమిళగ వెట్రి కజగమ్ పార్టీ చీఫ్ విజయ్ దళపతి రాజకీయ అరంగేట్రం చేస్తున్న కీలక ప్రాంతమైన కరూర్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించారు.


ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కుట్ర పన్నాయని తమిళనాడులో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అర్హులైన ఓటర్ల పేర్లను కూడా తొలగించారని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేను తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న టీవీకే ఈ విషయంలో ఎంకే స్టాలిన్ పార్టీతో ఏకీభవించారు. ఓటర్ల జాబితాలో ఈ స్థాయిలో కోత విధించడం సరికాదని టీవీకే అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న ఈ ఓటర్ల తొలగింపు నిర్ణయాన్ని స్వాగతించారు. దొంగ ఓట్లను తొలగించాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని.. ఈ గణాంకాలు తమ వాదనను బలపరుస్తున్నాయని ఈపీఎస్ పేర్కొన్నారు. ఇక తమ పేర్లు పొరపాటున తొలగించబడ్డాయని భావించే వారు లేదా కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు జనవరి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన ప్రతి ఓటరుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa