ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ భద్రతకు ముప్పుగా బంగ్లాదేశ్‌ అనిశ్చితి,,,,సరిహద్దుల్లో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 08:54 PM

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అనిశ్చితి భారత్‌కు సవాల్ విసురుతోంది. భారతదేశ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమ్ బెంగాల్, బిహార్, అసోం రాష్ట్రాలలో భారత్ మూడు కొత్త ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత వ్యూహాత్మకమైన ‘చికెన్స్ నెక్’గా అని పిలిచే సిలిగురి కారిడార్‌ను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. తాజాగా, మిజోరంలో నాలుగో స్థావరాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా చికెన్ నెక్స్ చుట్టుపక్కల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి పరిశీలనకు ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్సీ తివారి డిసెంబర్ 19న మిజోరాం రాజధాని ఐజ్వాల్ సమీపంలోని థుంపూయిని సందర్శించనున్నారని పేర్కొన్నాయి.


ఈ సందర్భంగా మిజోరాంలో ఆర్మీ బృందాన్ని ఎక్కడ మోహరించాలి? అనేది గుర్తించనున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దుందుడుకు చర్యలనైనా ఎదుర్కోవడానికి ఇది మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ తివారితో పాటు థర్డ్ కార్ప్స్ GOC లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ ఎస్. పెంధార్కర్, 17వ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ GOC లెఫ్టినెంట్ జనరల్ యష్ అహ్లావత్ కూడా థుంపూయికి వస్తారని వర్గాలు తెలిపాయి. అక్కడ అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పార్వ, సిల్సురి అవుట్‌పోస్టులను సందర్శిస్తారు.


మమిత్ జిల్లా పశ్చిమ ఫైలెంగ్ బ్లాక్‌లోని ఒక పెద్ద గ్రామమైన సిల్సురి.. దక్షిణ మిజోరాంలోని లాంగ్‌ట్లై జిల్లాలో పర్వ బోర్డర్ అవుట్‌పోస్ట్ కు సమీపంగా ఉంది. ముఖ్యంగా, పర్వ భారత్-మయన్మార్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ సున్నితమైన ప్రాంతంలో ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్‌ కూడా సరిహద్దుల్లో రక్షణ నిర్మాణాలను చేపట్టాలని యోచిస్తోంది. సిల్చార్, మిజోరాం సరిహద్దుల్లోని మూడు బెటాలియన్ కమాండ్ ప్రాంతాలలో బంకర్లు, 'రింగ్ బంధ్‌లు' (తాత్కాలిక లేదా శాశ్వత కృత్రిమ కట్టడాలు), పేలుడు నిరోధక , భూగర్భ ఆయుధాగారాలు నిర్మించనున్నారు.


‘కార్యాచరణ సున్నితత్వం, ముప్పు అంచనా ఆధారంగా ఈ ‘కీలక మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం’ అని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రాబోయే ఐదేళ్లలో ఈ నిర్మాణాలు జరుగుతాయి. ప్రతి మూడు బెటాలియన్ ప్రాంతాలలో 45 బంకర్లు, రింగ్ నిర్మాణాలు, పేలుళ్లను నిరోధించే గదులు, భూగర్భ ఆయుధాగారాలు నిర్మించనున్నారు.


మిజోరాం సెక్టార్‌లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి 85 బోర్డర్ ఔట్‌పోస్ట్‌లు ఉన్నాయి. వీటిని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ‘సమగ్ర’ కార్యాచరణ కేంద్రాలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వర్గాలు వివరించారు. ఇప్పటికే మిజోరాంలోని లుంగ్లీ, లాంగ్‌ట్లై జిల్లాల్లో 40 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 19 నిర్మాణాలకు అనుమతి లభించింది, కానీ అవి ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు. రాబోయే ఐదేళ్లలో 26 BOPలలో ఈ నాలుగు కీలక నిర్మాణాలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa