ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

international |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 10:33 PM

పాకిస్తాన్ సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్.. ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని బోయా ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరంపై శుక్రవారం ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్న తర్వాత.. మిగిలిన ఉగ్రవాదులు ఆ ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం.


ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని మిరాన్షాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోయా ముహమ్మద్ ఖేల్ మిలిటరీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో ఈ దాడి జరిగింది. మొదట ఒక ఆత్మాహుతి బాంబర్.. ఆ ఆర్మీ క్యాంప్ బయటి గోడ వద్ద పేలుడు పదార్థాలను పేల్చాడు. ఆ తర్వాత మిగిలిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే లోపలికి చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం వారిపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతం అయ్యారు.


ఇక సూసైడ్ బాంబర్ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆ పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. 2025 ఏడాదిలో పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) పాకిస్తాన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి.. ఈ ఉగ్రదాడులను తీవ్రం చేసింది.


 ఈ ఏడాది జూన్‌లో ఉత్తర వజీరిస్థాన్‌లోని మీర్ అలీ వద్ద జరిగిన ఆత్మాహుతి కార్ బాంబు దాడిలో 16 మంది పాక్ సైనికులు మరణించారు. అక్టోబర్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన భారీ ఆపరేషన్‌లో 11 మంది జవాన్లు.. 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం.. ఉగ్రవాద మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాక్‌లో ఉగ్రదాడుల మరణాలు ఏకంగా 45 శాతం పెరగడం గమనార్హం.


ప్రస్తుతం ఆత్మాహుతి దాడి జరిగిన ఆర్మీ క్యాంప్ ప్రాంతాన్ని పాక్ సైన్యం పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. పేలుడు పదార్థాలను తొలగించడానికి.. బాంబ్ డిస్పోజల్ యూనిట్లను రంగంలోకి దించింది. సమీపంలోని హైవేలపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa