ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనాభా పెరుగుతున్నా కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు ఐఎంఎఫ్ నో

international |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 11:01 PM

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో.. కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి మొండికేసింది.


ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందని, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.


కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంగీకరించలేదు. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి.. ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.


ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా.. ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి. విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం 'లగ్జరీ' వస్తువులుగా పరిగణించాల్సి రావడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.


అయితే ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే పాక్ ప్రభుత్వం వదిలేయాల్సి వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa