ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ స్థాయిలో పాక్ పరువు తీస్తున్న యాచకులు

international |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 10:56 PM

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ అవమానం ఎదురైంది. పవిత్రమైన ఉమ్రా, పర్యాటక వీసాలను అడ్డం పెట్టుకుని విదేశాల్లో 'భిక్షాటన'ను ఒక వృత్తిగా మార్చుకున్న వేలాది మంది పాక్ పౌరులపై సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కొరడా ఝుళిపించాయి. నేరాలు, యాచనకు పాల్పడుతున్న దాదాపు 56,000 మంది పాకిస్థానీయులను సౌదీ అరేబియా తాజాగా బహిష్కరించింది. పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్కడి పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడి అయ్యాయి.


నివేదికలో వెల్లడైన దిగ్భ్రాంతికర గణాంకాలు


పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2025లో అక్రమ వలసలు, భిక్షాటన నిర్మూలనలో భాగంగా మొత్తం 66,154 మంది పాక్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించాయి. 2023లో ఈ సంఖ్య 35,000గా ఉండగా.. కేవలం ఏడాది కాలంలోనే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వీరిలో 51,000 మంది కేవలం వర్క్, టూరిస్ట్, ఉమ్రా వీసాల పేరుతో వెళ్లి అక్కడ యాచనకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.


 ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సౌదీ అరేబియానే 24,000 మందిని బహిష్కరించగా.. దుబాయ్ 6,000 మందిని, అజర్‌బైజాన్ 2,500 మందిని వెనక్కి పంపింది. కేవలం గల్ఫ్ దేశాలే కాకుండా కాంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాలకు పర్యాటక వీసాలపై వెళ్తున్న పాకిస్థానీయులు కూడా అదృశ్యం అవుతున్నారని.. తిరిగి మాతృదేశానికి రావడం లేదని ఎఫ్‌ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ ఆందోళన వ్యక్తం చేశారు.


విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో (మక్కా, మదీనా వంటివి) అరెస్టవుతున్న భిక్షగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరు కేవలం భిక్షాటనకే పరిమితం కాకుండా యాత్రికుల జేబులు కత్తిరించడం వంటి నేర కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు వివరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా పాకిస్థాన్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మంటగలిసిపోతోందని నివేదిక పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. యూఏఈ ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా కొన్ని విభాగాల్లో జారీని నిలిపివేసింది.


పర్యాటక వీసాలపై వెళ్లే వారు తిరిగి రాకపోవడం వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. కాంబోడియాకు వెళ్లిన 24,000 మందిలో సగం మంది మాత్రమే తిరిగి రాగా.. మయన్మార్ వెళ్లిన 4,000 మందిలో 2,500 మంది ఆచూకీ లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాల్లో పాకిస్థానీయుల ప్రవర్తన కారణంగా నిజాయితీగా పని కోసం వెళ్లే నిరుద్యోగులు కూడా ఇప్పుడు వీసాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa