ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత,,,ప్రతిపక్ష నేత మృతితో అల్లకల్లోలం

international |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 11:00 PM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సెగలు మళ్లీ మొదలయ్యాయి. హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, 'ఇంక్విలాబ్‌ మంచ్‌' కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది మరణవార్త ఆ దేశాన్ని నిప్పులకొలిమిలా మార్చింది. హైది మృతితో ఆగ్రహించిన నిరసనకారులు రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో విధ్వంసానికి దిగారు. ఈ క్రమంలో భారత దౌత్య కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరగడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.


భారత హైకమిషన్ ముట్టడి..


గురువారం రాత్రి 11 గంటల సమయంలో చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందలాది మంది ఆందోళనకారులు కార్యాలయాన్ని చుట్టుముట్టి భారత్‌కు వ్యతిరేకంగా, అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా హోరెత్తేలా నినాదాలు చేశారు. హైదిపై జరిగిన కాల్పుల వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ దౌత్య కార్యాలయం వెలుపల బైఠాయించారు. దీనితో సరిహద్దు దేశాల మధ్య దౌత్యపరమైన చిక్కులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.


 నిరసనకారుల ఆగ్రహం మీడియా సంస్థలపై కూడా పడింది. ఢాకాలోని ప్రఖ్యాత 'డెయిలీ స్టార్' పత్రికా కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పు పెట్టారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకోగా, భవనంలో చిక్కుకున్న సుమారు 25 మంది జర్నలిస్టులను రెస్క్యూ టీమ్ అతి కష్టమ్మీద రక్షించింది. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. కేవలం డెయిలీ స్టార్ మాత్రమే కాకుండా, 'ప్రోథోమ్‌ అలో' కార్యాలయంపై కూడా దాడులు జరిగాయి. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన 'న్యూఏజ్' పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడులకు నిరసనగా బంగ్లాదేశ్‌లోని ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.


నిరసనకారుల విధ్వంసం ఇంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పూర్వీకుల నివాసం (ప్రస్తుతం మ్యూజియం) పై దాడి చేసి ఆ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. జూలైలో జరిగిన విద్యార్థి ఉద్యమంలో, షేక్ హసీనాను గద్దె దించడంలో ఉస్మాన్ హైది అత్యంత కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైది గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయడం గమనార్హం.


మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో హింస తగ్గడం లేదు. ఒకవైపు మీడియాపై దాడులు, మరోవైపు అంతర్జాతీయ దౌత్య కార్యాలయాల ముట్టడి బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa