అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ దరఖాస్తుదారులకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హెచ్ 1బీ వీసాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఈ మేరకు దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అడ్వైజరీ విడుదల చేసింది. అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, అదే సమయంలో వీసా ప్రాసెసింగ్లో జాప్యం జరుగుతుండటంతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. త్వరగా వీసా ఇప్పిస్తామంటూ నమ్మబలికే ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను త్వరగా ఇప్పిస్తామని లేదా వీసా గ్యారెంటీగా వచ్చేలా చేస్తామని కొందరు ఏజెంట్లు దరఖాస్తుదారులను సంప్రదిస్తున్నట్లు ఎంబసీ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన.. ఏ ఏజెంట్కు లేదా ప్రైవేట్ సంస్థకు వీసా నిర్ణయాలను ప్రభావితం చేసే అధికారం లేదని అధికారులు తేల్చి చెప్పారు. అదనపు డబ్బులు అడిగే వారిని నమ్మితే ఆర్థిక నష్టంతో పాటు ప్రయాణ ప్రణాళికలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
వీసా అపాయింట్మెంట్లను కేవలం అధికారిక వెబ్సైట్ www.ustraveldocs.com ద్వారా మాత్రమే షెడ్యూల్ చేసుకోవాలని యూఎస్ ఎంబసీ పేర్కొంది. దరఖాస్తు ప్రక్రియలో పేర్కొన్న అధికారిక ఫీజు తప్ప, ఏజెంట్లకు ఎలాంటి అదనపు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని సూచించింది. సరైన సమాచారం కోసం మాత్రమే travel.state.gov లేదా in.usembassy.gov వెబ్సైట్లను సంప్రదించాలని వెల్లడించింది.
జాప్యానికి కారణాలేంటి?
అమెరికా ప్రభుత్వం ఇటీవల వీసా నిబంధనలలో మార్పులు చేయడం, పాత లాటరీ పద్ధతి స్థానంలో నైపుణ్యం, వేతనం ఆధారిత ఎంపికను తీసుకురావడంతో ప్రాసెసింగ్లో కొంత జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా కొన్ని నెలల పాటు ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఉన్న హెచ్ 1బీ వీసా హోల్డర్లలో దాదాపు 71 శాతం మంది భారతీయులే కావడంతో.. మోసగాళ్లు ప్రధానంగా భారతీయ దరఖాస్తుదారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa