ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెల్‌బోర్న్ టెస్టులో అంపైరింగ్ వివాదం, లబుషేన్ ఔట్ నిర్ణయంపై తీవ్ర చర్చ

sports |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 10:53 PM

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన యాషెస్ నాలుగో టెస్టు రెండో రోజు పెద్ద అంపైరింగ్ వివాదానికి వేదికైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ వికెట్ విషయంలో తీసుకున్న థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ బౌలింగ్‌లో లబుషేన్ ఎడ్జ్ ఇచ్చాడు. స్లిప్‌లో జో రూట్ అందుకున్న క్యాచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా, లబుషేన్ మాత్రం క్యాచ్ క్లీన్‌గా పట్టలేదన్న భావనతో క్రీజ్‌లోనే నిలిచాడు.


ఫీల్డ్ అంపైర్ ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు అప్పగించాడు. పలు కోణాల నుంచి రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్, బంతి నేలను తాకలేదని, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని పేర్కొంటూ అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో లబుషేన్ తీవ్ర అసహనంతో పెవిలియన్‌కు చేరాడు. అతని నిరాశ స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలోనూ ఈ నిర్ణయంపై చర్చ మొదలైంది.


యాషెస్ సిరీస్‌లో డీఆర్ఎస్ స్నికోపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు ఆస్ట్రేలియాతో పాటు ఇటు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా స్నికో తప్పిదాలతో ఇబ్బంది పడ్డారు. అడిలైడ్ టెస్టులో అలెక్స్ క్యారీ అవుటయినప్పటికీ అది నాటౌట్‌గా చూయించడంతో చివరికి ఐసీసీనే నేరుగా స్పందించాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లబుషేన్ క్యాచ్‌పై కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే మెల్‌బోర్న్ టెస్టులో ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంటున్నట్టు కనిపించినా బ్రైడన్ కార్స్ అద్భుత బౌలింగ్‌తో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడంతో సీన్ రివర్స్ అయింది. బెన్ స్టోక్స్ కూడా వికెట్లు తీయడంతో ఆసీస్ 132 పరుగులకే ఆలౌట్ అయింది.


ఆస్ట్రేలియా అందించిన 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ - జాక్ క్రాలీ అద్భుతంగా ఆడటంతో ఇంగ్లండ్ విజయానికి దారులు పడ్డాయి. ఆ తర్వాత జాకబ్ బేతేల్ కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచి, 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు రోజులు జరగాల్సిన మెల్‌బోర్న్ టెస్టు కేవలం రెండు రోజులకే ముగియడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa