దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా ఘోరంగా ఓటమిపాలయింది. సొంతగడ్డపై ఇంత దారుణంగా ఓడిపోవడంతో గౌతమ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. గంభీర్ను కోచ్గా తొలగించాలంటూ ధర్మశాలలో ఫ్యాన్స్ ఏకంగా గోల చేశారు. ఆ తర్వాత గంభీర్ కూడా టెస్టు కోచ్గా బీసీసీఐ ఇంకెవర్నయినా తీసుకుంటుందేమో అన్నట్టు వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ నేపథ్యం టెస్టు జట్టు కోచింగ్ విషయంలో బీసీసీఐ అంతర్గతంగా పునరాలోచన ప్రారంభించినట్టు సమాచారం.
భారత క్రికెట్ బోర్డులో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తులు, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను సంప్రదించి, రెడ్ బాల్ జట్టుకు కోచ్గా బాధ్యతలు స్వీకరించాలనే అంశంపై ఆసక్తి ఉందా అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్ ఆఫ్ క్రికెట్గా కొనసాగుతున్న లక్ష్మణ్, అదే బాధ్యతలో సంతృప్తిగా ఉన్నారని, సీనియర్ టెస్టు జట్టుకు కోచింగ్ చేయడంపై ఆసక్తి చూపలేదని సమాచారం.
గౌతమ్ గంభీర్ భారత వైట్ బాల్ జట్ల కోచ్గా ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలతో విజయవంతమైన రికార్డు కలిగి ఉన్నప్పటికీ, టెస్టు ఫార్మాట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై 10 టెస్టు పరాజయాలు గంభీర్పై విమర్శలకు దారి తీస్తున్నాయి.
గంభీర్కు 2027 వన్డే ప్రపంచకప్ వరకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ, వచ్చే ఐదు వారాల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్లో భారత ప్రదర్శన ఆధారంగా ఈ ఒప్పందంపై తిరిగి సమీక్ష జరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం 2025–27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో మిగిలిన తొమ్మిది టెస్టులకు గంభీర్ టెస్టు కోచ్గా కొనసాగాలా? అనే అంశంపై బీసీసీఐలో స్పష్టత లేదని సమాచారం.
రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో ఆటగాళ్ల పాత్రలు స్పష్టంగా ఉండేవని, ప్రదర్శనకు తగిన సమయం కూడా దక్కేదని ఆటగాళ్ల వర్గాల్లో అభిప్రాయం ఉంది. అయితే గంభీర్ కోచ్గా కొనసాగుతున్న ఈ సమయంలో చాలామంది ఆటగాళ్లు భద్రత లేకుండా ఉన్నారని భావిస్తున్నారని కథనాలు చెబుతున్నాయి. టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి శుభ్మన్ గిల్ను తప్పించడం కూడా ఈ భావనకు బలం చేకూర్చిందని విశ్లేషకులు అంటున్నారు. భారత క్రికెట్లో తదుపరి పెద్ద స్టార్గా భావిస్తున్న ఆటగాడినే పక్కన పెట్టినప్పుడు, ఎవరికైనా జట్టులో స్థానం ప్రమాదంలో పడవచ్చన్న భావన డ్రెస్సింగ్ రూమ్లో నెలకొందని సమాచారం.
టీ20 ప్రపంచకప్ అనంతరం రెండు నెలల పాటు ఐపీఎల్ జరగనుండటంతో, కోచింగ్ విధానంపై, స్ప్లిట్ కోచింగ్ లేదా ఒకే కోచ్ కొనసాగాలా అన్న అంశంపై బీసీసీఐకి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా గంభీర్కు బీసీసీఐలో బలమైన మద్దతు ఉన్నప్పటికీ, వచ్చే రెండు నెలలు భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa