పిల్లలు దారి తప్పుతుంటే సరిదిద్దాల్సిన కన్నవారే కిరాతకులుగా మారారు. క్రమశిక్షణ పేరుతో కన్నకొడుకును గొలుసులతో బంధించి, తాళాలు వేసి చిత్రహింసలు పెట్టిన హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగుచూసింది. గత రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న 12 ఏళ్ల బాలుడిని అధికారులు ఎట్టకేలకు రక్షించారు.
గొలుసులతో బంధీగా..
దక్షిణ నాగ్పూర్ ప్రాంతానికి చెందిన ఓ జంట రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. వారి 12 ఏళ్ల కుమారుడు పాఠశాల మానేసి.. తరచూ బయట తిరుగుతుండేవాడు. అయితే వాడు మాట వినడం లేదని, సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే కోపంతో తల్లిదండ్రులు అమానవీయంగా ప్రవర్తించారు. ప్రతిరోజూ పనులకు వెళ్లే ముందు బాలుడి కాళ్లు, చేతులకు ఇనుప గొలుసులు కట్టి తాళం వేసి ఇంట్లోనే బంధించేవారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఆ ఇంటిపై దాడి చేయగా.. ఆ బాలుడు గొలుసులతో బిగించి, తీవ్ర భయాందోళనల మధ్య కనిపించాడు. గొలుసుల రాపిడి వల్ల బాలుడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఇదీ చూడండి: తల్లా.. రాక్షసా? చిన్నారి మీద కూర్చొని చిత్రహింసలు, బాధతో ఏడుస్తున్నా...
పోలీసుల విచారణలో తల్లిదండ్రులు తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తమ కొడుకు విపరీతమైన అల్లరి చేస్తున్నాడని, ఇతరుల ఫోన్లు దొంగిలించి పారిపోతున్నాడని.. అందుకే వాడిని నియంత్రించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే కారణం ఏదైనా ఒక పిల్లాడిని ఇలా పశువుల కంటే హీనంగా బంధించడం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే రెండుసార్లు ఈ గొలుసుల బంధీ గురించి పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. చివరకు స్థానికులు 'చైల్డ్ హెల్ప్లైన్' (1098)కు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ బాలుడిని విడిపించింది. ప్రస్తుతం ఆ బాలుడిని సురక్షిత ప్రాంతానికి తరలించి.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన తల్లిదండ్రులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన బాలల హక్కుల తీవ్ర ఉల్లంఘనే అని, పిల్లలపై శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్షార్హులేనని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ హెచ్చరించింది. ఎక్కడైనా పిల్లలపై హింస లేదా నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే 1098 నంబర్కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa