ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సంవత్సరంలో రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 11:07 PM

కొత్త సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) మరో కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల కరెన్సీ నోట్ల వివరాల్ని వెల్లడించింది. ఇప్పటివరకు చలామణీలో ఉన్న దాంట్లో ఏకంగా 98.41 శాతం వరకు రూ. 2 వేల విలువైన నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. మొత్తం ఈ కరెన్సీ నోట్ల విలువ 2023, మే 19న రూ. 3.56 లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అది రూ. 5,669 కోట్లకు చేరుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇంకా చలామణీలో రూ. 5,669 కోట్ల వరకు విలువైన 2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2025, డిసెంబర్ 31 వరకు ఉన్న డేటాకు సంబంధించి.. ఈ వివరాల్ని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో విడుదల చేసింది.


2023, మే 19న ఆర్బీఐ 2 వేల నోట్లపై సంచలన ప్రకటన చేసింది. ఈ పెద్ద నోట్లను చలామణీ నుంచి వెనక్కి తీసుకుంటున్నామని (ఉపసంహరణ) పేర్కొంది. అప్పట్లో జనం తమ దగ్గరున్న ఈ నోట్లను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ బ్రాంచుల ద్వారా డిపాజిట్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ అవకాశం 2023, అక్టోబర్ 7 వరకు కొనసాగింది. ఇక అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సదుపాయం తీసుకొచ్చింది. అక్కడ డిపాజిట్ చేసి బ్యాంక్ అకౌంట్లలోకి క్రెడిట్ చేయడం ప్రారంభించింది.


ఇప్పుడు జనం తమ దగ్గర ఉన్నటువంటి రూ. 2 వేల విలువైన కరెన్సీ నోట్లను దేశంలోని ఎక్కడి పోస్టాఫీస్ నుంచి అయినా ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపించే వెసులుబాటు తీసుకొచ్చింది. అయితే ఆర్బీఐ గతంలో ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటికీ వీటిని రద్దు చేయలేదు. అంటే చట్టపరంగా ఇవి ఇంకా చెల్లుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. తాజాగా మరోసారి జనవరి 1న ఆర్బీఐ దీనిపై కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల విలువైన కరెన్సీ నోట్లు ఇప్పటికీ లీగర్ టెండర్‌గానే (చట్టబద్ధ కరెన్సీ) కొనసాగుతాయని స్పష్టం చేసింది.


>> ఇక అంతకుముందు చూసుకుంటే 2016 నవంబర్ 8న.. నల్లధనాన్ని అరికట్టేందుకు అప్పటి పెద్ద నోట్లుగా చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 విలువైన కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ఆ తర్వాత కొంత కాలానికి కొత్త రూ. 500, రూ. 2 వేల నోట్లను ముద్రించి విడుదల చేసింది. అప్పట్లో నోట్ల రద్దుతో.. తీవ్రమైన నగదు కొరత కూడా ఏర్పడింది. జనం పాత నోట్లను మార్చుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత 2023, మే 19న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఇప్పుడు రూ. 500 నోటే భారతదేశంలో పెద్ద నోటుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa