ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఏపీ వర్సిటీల పనితీరు మెరుగుపడాలన్న గవర్నర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 08:40 PM

జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాల పనితీరును తెలిపే ఎన్ఐఆర్ఎఫ్  ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైస్ ఛాన్సలర్లు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. 2025 ర్యాంకింగ్స్ ప్రకారం రాష్ట్రంలోని 25 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయం మాత్రమే టాప్-50లో, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం టాప్-100లో స్థానం సంపాదించాయని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. గవర్నర్ నజీర్ మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయాలు విద్యా పరిపక్వతలో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ర్యాంకులు మన పనితీరును సమీక్షించుకుని, టాప్-100లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి అని అన్నారు. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించాలని, నాణ్యతను బయటి అవసరంగా కాకుండా సంస్థ అంతర్గత సంస్కృతిగా మార్చుకోవాలని సూచించారు.స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్య అంటే మెదడులో సమాచారం నింపడం కాదని, మనసును సరైన మార్గంలో తీర్చిదిద్దడమని గుర్తుచేశారు. పాఠాలను కంఠస్థం చేయించే పద్ధతికి స్వస్తి పలికి, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించేలా బోధన ఉండాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఉన్నత విద్య స్థూల ప్రవేశాల నిష్పత్తి  36.5గా ఉండి, జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉండటం ప్రశంసనీయమని గవర్నర్ అన్నారు. అయితే, జాతీయ గణాంకాల నివేదిక ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తొలి తరం అభ్యర్థుల అవసరాలపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా, విద్య అంతిమ లక్ష్యం నైపుణ్యం, నిపుణత కలిగిన మంచి మనుషులను తయారు చేయడమే. విశ్వవిద్యాలయాలు కేవలం బోధనా కేంద్రాలుగా కాకుండా, విజ్ఞానాన్ని సృష్టించే ఇంజిన్లుగా మారాలి. పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని గవర్నర్ పేర్కొన్నారు. పారదర్శకమైన నిర్ణయాలు, జవాబుదారీతనంతో విశ్వవిద్యాలయాల విశ్వసనీయతను కాపాడాలని వీసీలకు దిశానిర్దేశం చేశారు.ఆదర్శ ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వంతెనలుగా నిలిచి, భవిష్యత్తులో వారు సొంతంగా వంతెనలు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తారు అన్న నికోస్ కజాంత్జాకిస్ మాటలను గవర్నర్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మానవ వనరుల బలోపేతంపై ఆధారపడి ఉందని, ఈ లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa