సముద్రంలో కాలుష్య నియంత్రణకు పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తొలిసారిగా ఓ నౌకను భారత్ రంగంలోకి దింపింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం (జనవరి 5న) ప్రారంభించారు. ఇది భారత స్వయం సమృద్ధి, నౌకా నిర్మాణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక.. సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రించడం, అగ్నిప్రమాదాల నివారణ, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణలో దేశ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అంతేకాదు, ప్రాదేశిక జలాలు, తీరప్రాంత గస్తీ, సుదూర నిఘా కార్యకలాపాలను బలపరుస్తుంది.
60 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో నిర్మించిన సముద్ర ప్రతాప్ .. భారత కోస్ట్ గార్డ్ నౌకాదళంలో అతిపెద్ద నౌక. గోవా షిప్యార్ట్ లిమిటెడ్ నిర్మిస్తున్న రెండు కాలుష్య నియంత్రణ నౌకలలో ఇది మొదటిది. ఈ నౌక పరిణితి చెందిన భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థకు నిదర్శనమని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సముద్ర ప్రతాప్, భారతీయ నౌకా నిర్మాణ సంస్థలు ఆధునిక, సరళమైన, సాంకేతికతతో కూడిన విధానాన్ని అవలంబిస్తున్నాయనేది వివరించింది. యుద్ధనౌకలలో స్వదేశీ సాంకేతికత శాతాన్ని దాదాపు 90 శాతానికి పెంచడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
‘ప్రధానంగా కాలుష్య నియంత్రణ కోసం రూపొందించినప్పటికీ ఈ నౌక ఒకే వేదికపై బహుళ సామర్థ్యాలను కలిగి ఉంది... ఇది తీరప్రాంత గస్తీ, సముద్ర భద్రతా కార్యకలాపాలకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది’ అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ‘కాలుష్య నియంత్రణ, రెస్క్యూ, భద్రత వంటి భారత కోస్ట్ గార్డ్ బహుముఖ పాత్ర.. సముద్రంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా దుస్సాహసం చేస్తే ధైర్యంగా, తగిన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టమైన సందేశాన్ని పంపింది’ అని ఆయన నొక్కి చెప్పారు.
అధునాతన కాలుష్య గుర్తింపు వ్యవస్థలు, ప్రత్యేక పడవలు, ఆధునిక అగ్నిమాపక పరికరాలు, హెలికాప్టర్ హ్యాంగర్ సహా వైమానిక సౌకర్యాలతో సముద్ర ప్రతాప్, కఠినమైన సముద్ర పరిస్థితులలో కూడా సమర్థవంతంగా పనిచేయగలదు. ఈ సామర్థ్యాలు కాలుష్య సంఘటనలను సకాలంలో నియంత్రించడానికి, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, తీరప్రాంత జీవనోపాధిని, నీలి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి సహాయపడతాయని రక్షణ మంత్రి తెలిపారు.
సముద్ర పర్యావరణ పరిరక్షణను వ్యూహాత్మక అవసరంగా, నైతిక బాధ్యతగా పేర్కొంటూ.. భారత్ ఇప్పుడు అధునాతన పర్యావరణ ప్రతిస్పందన సామర్థ్యాలు కలిగిన కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వచ్ఛమైన సముద్రాలు సురక్షితమైన వాణిజ్యాన్ని, జీవితాలను, స్థిరమైన సముద్ర వాతావరణాన్ని నిర్ధారిస్తాయని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కట్టుబడిన బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా భారతదేశ పాత్రను బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa