ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవోకే సహా కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలిపేయండి.. బ్రిటన్ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 08:54 PM

జమ్మూ కశ్మీర్ ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై బ్రిటన్‌ ప్రజాప్రతినిధి బాబ్‌ బ్లాక్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే, గిల్గిత్ బాల్టిట్‌స్థాన్ సహా జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని న్యూఢిల్లీ ప్రభుత్వానికి బ్రిటన్ ఎంపీ సూచించారు. కశ్మీర్‌ను పాకిస్థాన్ ఆక్రమించడాన్ని గతంలోనూ తాను వ్యతిరేకించానని.. ఎప్పటికీ తన వైఖరి ఇదేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, 1992లో కశ్మీరీ పండితుల వలసలకు ముందే ఆర్టికల్ 370ను రద్దుచేసి ఉండాల్సిందని బాబ్ బ్లాక్‌మెన్ అభిప్రాయపడ్డారు. అలా చేసుంటే కశ్మీరీ పండితులపై ఊచకోతలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం విస్తరణ జరిగేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.


రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్‌ ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఓకేను అక్రమంగా ఆక్రమించి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, అక్కడ ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విస్తరించడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ మొత్తాన్ని విలీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి తాను అనేకసార్లు సూచించినట్లు బ్రిటిష్ ఎంపీ తెలిపారు. గతేడాది జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడి అక్కడ శాంతి నెలకుంటోందని తాను భావించానని.. కానీ పహల్గామ్ దాడితో ఉగ్రవాద సమస్య మళ్లీ మొదలైందన్నారు.


సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తే భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారే అవకాశం ఉంటుందని ఇస్లామాబాద్‌ను ఆయన హెచ్చరించారు. బాబ్ బ్లాక్‌మన్ గతేడాది ఖలీస్థాన్ శక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ.. వారి చర్యలను ఖండించారు. బాబ్ బ్లాక్‌మన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, హర్యానా ఇంఛార్జ్ సతీష్ పూనియా స్పందిస్తూ.. ‘ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రపంచ సంక్షేమం, శాంతి కోసం భారత్ మంత్రాన్ని ప్రతిధ్వనించారు’ అని అన్నారు. భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే బ్లాక్‌మన్.. ‘ప్రధాని నరేంద్ర మోదీ బలమైన సంకల్పం, ప్రజా సంక్షేమ విధానాలు, దృఢమైన నిర్ణయాలకు బ్రిటిష్ పార్లమెంట్‌లో బలమైన గొంతుకగా ఉండటమే కాకుండా, వివిధ ప్రపంచ వేదికలపై మోదీ బలమైన నాయకత్వం, భారత్ గురించి కూడా బాబ్ అనర్గళంగా మాట్లాడుతున్నారు’ అని పూనియా అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa