టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు మరోసారి బరిలోకి దిగుతాడని భావించిన ఈ రన్మెషీన్.. ఊహించని రీతిలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు సమాచారం.బీసీసీఐ ఆదేశాల మేరకు అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్కప్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్గదర్శకాల ప్రకారం దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారేలో పాల్గొన్నాడు.నిబంధనల ప్రకారం కనీసం రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో, తాజా సీజన్లో ఢిల్లీ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి చేశాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో వరుస శతకాలతో మంచి ఫామ్లో ఉన్న కోహ్లి, దేశీ క్రికెట్లోనూ అదే జోరును కొనసాగించాడు. ఆంధ్రప్రదేశ్ జట్టుపై 131 పరుగులు చేయగా, గుజరాత్పై 77 పరుగులు సాధించాడు.న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి స్వదేశంలో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్కూ అందుబాటులో ఉంటానని కోహ్లి ముందుగా తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.అయితే తాజా పరిణామాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ కోచ్ సరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ, “లేదు. కోహ్లి ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు” అని స్పష్టం చేశాడు. దీంతో రిషభ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ జట్టు వచ్చే మంగళవారం (జనవరి 6) రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్కు కర్ణాటకలోని ఆలూర్ ప్రాంతంలో ఉన్న కేఎస్సీఏ క్రికెట్ గ్రౌండ్–2 వేదికగా ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa