భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైయస్.జగన్ దేనని, అయితే దాన్ని కూడా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఫస్ట్ టెస్ట్ ప్లైట్ ల్యాండింగ్ నేపధ్యంలో ఈ ఘనత తమదేనని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు.. ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో వారి కంట్రిబ్యూషన్ ఏముందని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీకి పాల్పడ్డం వారికి వెన్నతో పెట్టిన విద్య అని తేల్చి చెప్పారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్ పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారన్న అమర్నాధ్.. భూసేకరణ, అనుమతులు, ఆర్ధిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేస్తారని నిలదీశారు. 2019లో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్ పోర్టు కోసం భూసేకరణతో పాటు అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3 న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదే రోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఉత్తరాంధ్రా వాసుల ఆకాంక్షను వైయస్.జగన్ వెలిబుచ్చారన్న అమర్నాధ్... అందులో భాగమే నిన్నటి టెస్ట్ ప్లైట్ ల్యాండింగ్ అని స్పష్టం చేశారు. ఇదే వైయస్.జగన్ విజన్ కి తార్కాణమన్న అమర్నాధ్... విజన్ అంటే జగన్ - భజన అంటే బాబు తేల్చి చెప్పారు. నిర్వాసితులకు సైతం వైయస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ... నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండు చోట్ల కాలనీలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీటీడీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్ పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో వైయస్.జగన్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa