ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యాన్ని మరింత ఉద్రిక్తతల వైపు నెట్టుతున్నాయి. నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ట్రంప్, “సహాయం త్వరలో వస్తుంది” అంటూ ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టే అవకాశాలపై కూడా ఆయన సంకేతాలు ఇవ్వడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖామెనేయి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ రక్షణ మంత్రి అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఘాటైన హెచ్చరికలు జారీ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది.అమెరికా దాడికి పాల్పడితే మధ్యప్రాచ్య ప్రాంతంలోని అన్ని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టంగా హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాగర్ ఘాలీబాఫ్తో పాటు రక్షణ రంగ నేతలు మాట్లాడుతూ, వాషింగ్టన్ ఏదైనా సాహసం చేస్తే అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు, అలాగే అమెరికా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నీ చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని తేల్చి చెప్పారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమేనని ఇరాన్ స్పష్టం చేసింది.మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న కతార్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్ దేశాలకు కూడా ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది. తమ భూభాగాన్ని అమెరికా వినియోగించుకునేందుకు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంకేతాలు ఇస్తోంది. ఇరాన్ మిసైల్ పరిధిలో మధ్యప్రాచ్యంలో ఉన్న దాదాపు అన్ని అమెరికా స్థావరాలూ ఉన్నాయని సైనిక నిపుణులు చెబుతున్నారు.మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరం కతార్లోని ‘అల్ ఉదేద్’ ఎయిర్బేస్. గతంలోనే ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిసైల్ దాడులు జరిపినట్లు సమాచారం ఉంది. అలాగే బహ్రెయిన్ రాజధాని మనామాలో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం గల్ఫ్ ప్రాంతంలో కీలక వ్యూహాత్మక కేంద్రంగా కొనసాగుతోంది. ఇరాక్లోని అల్-అసద్ ఎయిర్బేస్, యూఏఈలోని అల్ ధఫ్రా, కువైట్లోని క్యాంప్ అరిఫ్జాన్ కూడా అమెరికాకు అత్యంత కీలకమైన సైనిక స్థావరాలుగా ఉన్నాయి.దాడి జరిగితే భారీ స్థాయిలో మిసైల్ దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ వద్ద 2,000కు పైగా శక్తివంతమైన మిసైళ్లు ఉన్నాయని సమాచారం. ‘సెజ్జిల్’, ‘ఖొర్రమ్షహర్’ వంటి దీర్ఘశ్రేణి మిసైళ్లు రాడార్ను తప్పించుకునే సామర్థ్యం కలవిగా చెబుతున్నారు. అదేవిధంగా ‘షాహెద్’ డ్రోన్లతో సమూహ దాడులు నిర్వహించి శత్రు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అచేతనం చేసే వ్యూహం కూడా ఇరాన్ వద్ద ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇరాక్లోని షియా మిలీషియా, యెమెన్లో హౌతీలు, లెబనాన్లో హిజ్బుల్లా వంటి గ్రూపుల ద్వారా ఒకేసారి పలు రంగాల్లో దాడులు చేయించే సామర్థ్యం ఇరాన్కు ఉందని నిపుణుల అంచనా. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ భయాలతో ఉలిక్కిపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa