ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రయ్యుమని పరుగులు పెడుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 09:00 PM

థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పడిపోవడటంతో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌కు సుమారు 230 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు.


అసలేం జరిగిందంటే..?


సిఖియో జిల్లా పరిధిలో ప్రస్తుతం హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద ఉన్న పట్టాలపై జారిపడింది. దురదృష్టవశాత్తు అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికులతో నిండిన రైలు వెళ్తోంది. ఎత్తు నుంచి పడిన క్రేన్ ధాటికి రైలు బోగీలు తునాతునకలు అయింది.


క్రేన్ పడిన వేగానికి రైలు బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో రైలులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ విపత్తుతో రైలులో ఉన్న ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి.. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.


వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రేన్ పడటానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం ఉందా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలవగా.. దేశం మొత్తం మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకోగా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa