ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"పాలక్ పనీర్" కోసం పంతం.. అమెరికా వర్సిటీ మెడలు వంచిన భారతీయ విద్యార్థులు

international |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 09:05 PM

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ భారతీయ జంటకు అక్కడ తీవ్ర అవమానం ఎదురైంది. ముఖ్యంగా తాము ఎంతో ఇష్టంగా తినే పాలక్ పనీర్ కూరను.. యూనివర్శిటీకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం భోజనం సమయంలో దాన్ని మైక్రో ఓవెన్‌లో వేడి చేసుకుంటుండగా.. అక్కడే యూనివర్సిటీలో పని చేసే ఓ వ్యక్తి వచ్చి.. అది చెడు వాసన వస్తోందని చెప్పారు. ఇది బాగుంది, నేను వేడి చేసుకుని వెళ్లిపోతానని సదరు విద్యార్థి చెప్పినా వినకుండా రచ్చ చేశారు. ఆపై ప్రతిరోజూ అతడి వంటకాన్ని గుర్తు చేస్తూ హేళన చేయడం ప్రారంభించారు. దీంతో సదరు జంట న్యాయ పోరాటానికి దిగింది. ఈ కేసులో గెలిచి రూ.1.6 కోట్లు పొంది తిరిగి ఇండియాకు వచ్చేసింది.


అసలేం జరిగిందంటే..?


భారత దేశానికి చెందిన ఆదిత్య ప్రకాష్, అతని భాగస్వామి ఊర్మి భట్టాచార్యలు.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. అయితే 2023 సెప్టెంబర్ 5వ తేదీన ఆదిత్య ప్రకాష్ తన మధ్యాహ్న భోజన సమయంలో తన వెంట తీసుకెళ్లిన పాలక్ పనీర్‌ను వేడి చేసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే డిపార్ట్‌మెంట్‌లోని మైక్రో ఓవెన్‌లో పాలక్ పనీర్‌ను వేడి చేస్తుండగా.. ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి ఆ ఆహారం వాసన భరించలేకుండా ఉందని, దానిని వేడి చేయవద్దని అభ్యంతర పెట్టారు. దానికి ఆదిత్య బదులిస్తూ.. "ఇది కేవలం ఆహారం మాత్రమే. వేడి చేసుకుని వెళ్లిపోతాను" అని దృఢంగా చెప్పారు. అయితే ఈ చిన్న ఘటన తర్వాత ఆదిత్యపై యూనివర్సిటీ యంత్రాంగం నిరంతరం వేధింపులకు పాల్పడిందని బాధితులు ఆరోపించారు.


వివక్షపై ఆదిత్య ప్రశ్నించినందుకు గాను యూనివర్సిటీ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముఖ్యంగా ఊర్మి భట్టాచార్య ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కోల్పోయారు. క్యాంపస్‌లో భారతీయ ఆహారం తెచ్చినందుకు.. వీరిద్దరూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని నిందలు వేశారు. పీహెచ్‌డీ మధ్యలో విద్యార్థులకు అందజేసే మాస్టర్స్ డిగ్రీలను కూడా యూనివర్సిటీ వీరికి అందించడానికి నిరాకరించింది. అక్కడితో ఆగకుండా నిరంతరం మీటింగ్‌లకు పిలుస్తూ.. స్టాఫ్‌కు భద్రత లేదని ఆరోపిస్తూ వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు.


దీంతో ఈ వివక్షను సహించలేక ఆదిత్య, ఊర్మిలు 2025 మేలో ఫెడరల్ సివిల్ రైట్స్ దావా వేశారు. వీరికి మద్దతుగా ఆంత్రోపాలజీ విభాగానికి చెందిన 29 మంది విద్యార్థులు కూడా అండగా నిలిచారు. చివరికి 2025 సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీ దిగొచ్చి సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. 2 లక్షల డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.1.6 కోట్లు) పరిహారంతో పాటు వారికి మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది. అయితే భవిష్యత్తులో ఆ వర్సిటీలో చేరకుండా నిబంధన విధించింది.


వలసదారుల పట్ల వివక్షను నిరసిస్తూ ఈ జంట ఈ నెలలోనే ఇండియాకు తిరిగి వచ్చారు. "మా ఆహారం మా గర్వం.. ఒకవేళ భారతీయుల పట్ల ఇలాంటి వివక్ష చూపిస్తే మేము వెనక్కి తగ్గమని ఈ కేసు ఒక సందేశం పంపాలి" అని ఆదిత్య పేర్కొన్నారు. అమెరికా కల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని చాటిన ఈ విద్యార్థుల కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తినిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa