ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుల కోటా కోసం కాలు నరికేసుకున్న నీట్ అభ్యర్థి

national |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:56 PM

మన దేశంలో చాలా మంది పిల్లలు.. పెద్దయ్యాక ఏం అవుతావు అంటే డాక్టర్, ఇంజినీర్ అని చెబుతారు. ఇక తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే తమ పిల్లలు డాక్టర్, ఇంజినీర్ కావాలని కలలు కంటూ ఉంటారు. అంతేకాకుండా కొందరు తల్లిదండ్రులు అయితే.. పిల్లలకు ఇష్టం లేకున్నా బలవంతంగా వారిపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ చదివిస్తూ ఉంటారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదవాలంటే భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహరం మాత్రమే కాకుండా.. కఠోర శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. పుస్తకాలతో 24 గంటలు కుస్తీ పట్టినా.. సీటు దక్కించుకోవడం కష్టమే. ఏటా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్ల కోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే మెడికల్ సీటు కోసం ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది.


ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల యువకుడు మెడికల్ సీటు కోసం తన కాలును తానే నరుక్కోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నీట్ పరీక్షలో రెండుసార్లు విఫలమవ్వడంతో.. దివ్యాంగుల కోటాలో సీటు దక్కించుకోవచ్చని భావించిన సూరజ్ భాస్కర్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత దుండగులు దాడి చేశారని నాటకమాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఎంబీబీఎస్ కల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా ఖలీల్‌పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ గత రెండేళ్లుగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. రెండుసార్లు ఫెయిల్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఏడాది ఎలాగైనా ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని తన డైరీలో రాసుకున్నాడు. జనరల్ కేటగిరీలో సీటు రావడం కష్టమని భావించి.. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (దివ్యాంగుల) కోటాలో సీటు సులభంగా వస్తుందని ఒక దారుణమైన ప్లాన్ వేశాడు.


గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేసి.. కాలు నరికేశారని నమ్మించే ప్రయత్నం సూరజ్ భాస్కర్ చేశాడు. ఆదివారం రోజున స్పృహ లేకుండా పడి ఉన్న సూరజ్‌ను చూసిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జౌన్‌పూర్ సిటీ సర్కిల్ ఆఫీసర్ గోల్డీ గుప్తా నేతృత్వంలో జరిగిన విచారణలో సూరజ్ భాస్కర్.. మాటల్లో పొంతన లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.


అతని ఫోన్ రికార్డులు, డైరీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. దివ్యాంగుల కోటా కోసమే తన కాలును తానే నరుక్కున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సూరజ్ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దర్యాప్తును తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు కథనాలు సృష్టించినందుకు అతనిపై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే దానిపై పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa