కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా.. అధికార బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్న శశిథరూర్.. తాజాగా మరోసారి హైకమాండ్ భేటీకి దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ హాజరుకాకపోవడం సరికొత్త ఊహాగానాలకు దారితీస్తోంది. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని జరుగుతున్న ప్రచారానికి.. ఈ వ్యవహారం మరింత బలాన్ని చేకూర్చుతోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు నిర్వహించిన సమావేశానికి శశిథరూర్ హాజరు కాలేదు. కోజికోడ్లో జరుగుతున్న ఒక సాహిత్య ఉత్సవంలో పాల్గొనాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని ఆయన పార్టీకి సమాచారం అందించారు. అయితే గత వారం కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. ఆయనకు సరైన గౌరవం లభించలేదని.. అందుకే శశిథరూర్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరును.. భారత్ చేపట్టిన సైనిక చర్యలను శశిథరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించలేదు. ఇది ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. ప్రధాని మోదీ తర్వాత దేశంలో అత్యంత కష్టమైన పని గంభీర్దే అని శశిథరూర్ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ వర్గాలకు మింగుడు పడటం లేదు. దీన్ని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సమర్థిస్తూ.. కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు.
శశిథరూర్ వివరణ
మరోవైపు.. తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఇప్పటికే పలుమార్లు శశిథరూర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీని ప్రశంసించడం అంటే పార్టీ మారడం అని అర్థం కాదని క్లారిటీ ఇచ్చారు. జాతీయ ఐక్యత దృష్ట్యా కొన్నిసార్లు ప్రధానిని అభినందించాల్సి ఉంటుందని.. గత 16 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa