బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ వేదికగా చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పరారీలో ఉన్న ఒక 'నేరస్తురాలికి' భారత రాజధానిలో బహిరంగ ప్రసంగం చేసే అవకాశం కల్పించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది.2024 ఆగస్టులో ప్రజా తిరుగుబాటుతో పదవి కోల్పోయి భారత్కు వచ్చిన షేక్ హసీనా (78) అప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. అయితే శుక్రవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఆడియో ద్వారా ప్రసంగించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి."మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసి, కోర్టు ద్వారా మరణశిక్ష పడ్డ వ్యక్తికి భారత గడ్డపై ద్వేషపూరిత ప్రసంగాలు చేసే అవకాశం ఇవ్వడం ఆశ్చర్యకరం" అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హసీనాను అప్పగించాలని తాము పదేపదే కోరుతున్నా భారత్ స్పందించడం లేదని, పైగా ఆమెకు ఇలాంటి వేదికలు కల్పించడం బంగ్లాదేశ్ భద్రతకు ముప్పు అని ఆవేదన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa