రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తీరుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 'జంగిల్ రాజ్'గా మారిందని, సామాన్యులకు రక్షణ కరువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో జరిగిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోయే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధించడమే కాకుండా, ఎమ్మెల్యేలు రవికుమార్, ఆదిమూలం వంటి వారు కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు, సామాన్యులకు భద్రత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చే సంస్కృతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు.
మద్యం పాలసీ మరియు పండుగ వేడుకల నిర్వహణపై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలే స్వయంగా బెల్టు షాపులను నిర్వహిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారని విమర్శించారు. చివరికి సంక్రాంతి కోడిపందేలను కూడా వదలకుండా, వాటికి వేలం పాటలు నిర్వహించి ప్రభుత్వం దగ్గరుండి అరాచకాలను చేయిస్తోందని దుయ్యబట్టారు. గతంలో ఉన్న నియమ నిబంధనలను పక్కనబెట్టి, కేవలం ధనార్జనే ధ్యేయంగా పాలన సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ప్రస్తుత పాలకులు అటకెక్కించారని ఆరోపించారు. నిధుల విడుదల చేయకుండా పేదలకు వైద్యం, విద్య అందకుండా చేస్తున్నారని, ప్రజలే తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa