ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ వినియోగంపై సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, ఆమోదం లేని ఈ విధానాన్ని వైద్యపరమైన మోసంగా పరిగణిస్తామని తేల్చిచెప్పింది. ఈ తీర్పును ప్రముఖ వైద్య నిపుణులు స్వాగతించారు.జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఆమోదం పొందిన క్లినికల్ ట్రయల్స్ వెలుపల రోగులపై స్టెమ్ సెల్స్ వాడటం అనైతికమని పేర్కొంది. శాస్త్రీయంగా నిరూపణ కాని చికిత్సను రోగులు ఒక హక్కుగా డిమాండ్ చేయలేరని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పుడు నమ్మకాలతో రోగులు చికిత్స పొందడం వైద్య నైతికతను పూర్తిగా ఉల్లంఘించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.సుప్రీంకోర్టు నిర్ణయంపై ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మంజరి త్రిపాఠి హర్షం వ్యక్తం చేశారు.ఆటిజంతో పాటు ఇతర నరాల సంబంధిత సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీ పనిచేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్లు రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తూ రోగులను మోసం చేస్తున్నాయి. ఈ తీర్పు ఇంకా ముందే వచ్చి ఉండాల్సింది అని ఆమె అన్నారు.గతంలో 2022 డిసెంబరులోనే నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆటిజం చికిత్సకు స్టెమ్ సెల్ థెరపీని సిఫార్సు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇటీవలి ఐసీఎంఆర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చిందని ఎయిమ్స్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ షెఫాలీ గులాటీ తెలిపారు.అయితే, స్టెమ్ సెల్స్పై పరిశోధనలను సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు. నియంత్రిత క్లినికల్ ట్రయల్స్ రూపంలో పరిశోధనలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ ట్రయల్స్లో పాల్గొనే స్వేచ్ఛ రోగులకు ఉంటుందని తెలిపింది. ఆటిజం ఉన్న ఎలుకలపై తాము పరిశోధనలు చేస్తున్నామని, అయితే క్లినికల్ ప్రాక్టీస్లో మాత్రం దీనిని వాడరాదని డాక్టర్ గులాటీ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa