ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరు సర్వజన ఆస్పత్రిలో నిర్మించిన కానూరి - జింకానా మాతా, శిశు సంరక్షణ భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ భవనం నిర్మాణం కోసం జింకానా రూ.100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.27 కోట్ల నిధులు ఖర్చు చేశారు. అయితే మాతా శిశు సంరక్షణ భవనం ప్రారంభోత్సవం కోసం గుంటూరు జీజీహెచ్కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఓ వృద్ధురాలు గంటల తరబడి నిరీక్షించారు.
ఆస్పత్రి వద్ద చంద్రబాబుకు కలిసేందుకు వీలవుతుందేమోననే ఆశతో గంటల తరబడి ఆ వృద్ధురాలు పడిగాపులు కాశారు. అయితే ఆమె ఆశించినట్లు చంద్రబాబును కలిసేందుకు వీలు కుదరలేదు. కానీ.. సీఎంను కలిసేలా చూస్తానని ఏపీ గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హామీ ఇవ్వటంతో.. ఆ వృద్ధురాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే సీఎంను కలవాలనే ఆమె తపన వెనుక., గంటల తరబడి నిరీక్షించిన ఆమె ఓపిక వెనుక కదిలించే కారణం ఉంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనే ఓ మాతృమూర్తి ఆవేదన ఉంది. ఆమె పేరు.. పద్మావతి, కొత్తపేట శీలం వారి వీధి. ఆమెకు హరికృష్ణ అనే ఓ కొడుకు ఉండేవాడు. 2021లో బంధువుల అమ్మాయిని ఇచ్చి హరికృష్ణకు పెళ్లి జరిపించారు. అయితే ఏమైందో తెలియదు.. పెళ్లి జరిగిన మూడు నెలలకే తన కొడుకు ఐదు అంతస్తుల భవనం మీద నుంచి పడి అనుమానాస్పద రీతిలో చనిపోయాడని పద్మావతి చెప్తున్నారు. తన కొడుకు అనుమానాస్పద మృతిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని.. అయితే పోలీసులు తనకు న్యాయం చేయలేదని పద్మావతి వాపోయారు.
తన కుమారుడి మరణం విషయంలో తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా.. ఎలాంటి స్పందన లేదని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్లను గ్రీవెన్స్ కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేశానని.. అయినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. తన కొడుకు చనిపోయి ఐదేళ్లు గడుస్తున్నా.. అతని అనుమానాస్పద మృతిపై ఎలాంటి స్పష్టత లేదని చెప్పుకొచ్చారు.
పోలీసుల చుట్టూ తిరిగే ఓపిక లేక.. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తన గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చినట్లు మీడియాకు తెలిపారు. అయితే పోలీసులు ఆమెకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో.. ఆస్పత్రి ప్రాంగణంలోనే ఏడుస్తూ ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రంథాలయాల ఛైర్మన్ కోటేశ్వరరావు.. సీఎం కలిసేలా చూస్తానని హామీ ఇవ్వటంతో పద్మావతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa