విశాఖపట్నంలో భారీ భూ కుంభకోణం జరిగిందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ ప్రయోజనాల కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, కేవలం తన వర్గీయులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
ఈ వివాదంలో ప్రధానంగా రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల విలువైన భూమి ప్రస్తావనను జగన్ తెరపైకి తెచ్చారు. ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ భరత్కు కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో భూ కేటాయింపులు జరపడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని, ఇది బహిరంగంగా జరుగుతున్న దోపిడీ అని ఆయన అభివర్ణించారు. విశాఖను గ్లోబల్ సిటీగా మార్చడం అంటే ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తీరును జగన్ తప్పుబట్టారు. లోకేష్కు ఎటువంటి అధికార పరిధి లేకపోయినప్పటికీ, తన అధికార బలంతో తోడల్లుడికి ఈ భూములు దక్కేలా చక్రం తిప్పారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని, కుటుంబ సభ్యుల ఆర్థిక ఎదుగుదల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి పక్షపాత నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక ఈ భూ కేటాయింపుల ప్రక్రియలో జీవీఎంసీ (GVMC) సభ్యులపై ఒత్తిడి తెచ్చిన తీరును కూడా జగన్ తన ట్వీట్లో ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి అధికారులను, సభ్యులను భయపెట్టించి ఏకపక్షంగా ఆమోద ముద్ర వేయించుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కి, నిబంధనలను తుంగలో తొక్కి ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa