ముంబయి మేయర్ ఎన్నిక విషయంలో మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు దాదాపు తెరపడింది. ఫిబ్రవరి 11న జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికార కూటమి తన అభ్యర్థులను శనివారం ఖరారు చేసింది. మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘడీ పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు బీజేపీ, శివ్సేన నేతలు అమిత్ సతమ్ వెల్లడించారు.అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
జనవరి 15న జరిగిన బీఎంసీ ఎన్నికల్లో ఘోట్కాపూర్ డివిజన్ నుంచి తావ్డే విజయం సాధించారు. మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచిన రీతూ.. బృహన్ ముంబయి కార్పొరేషన్ విద్యా కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. రీతూ, సంజయ్లు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. సంజయ్ శంకర్ ఐదో నెంబరు డివిజన్ నుంచి గెలిచారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం ఎన్నిక నిర్వహిస్తారు. కాగా.. డిప్యూటీ మేయర్ పదవి కోసం నలుగురు కార్పొరేటర్ల పోటీ పడుతుండటంతో మొదట సంజయ్కు అవకాశం ఇవ్వగా.. ఆయన 15 నెలలు మాత్రమే ఉంటారు. ఘడీ సహా ఈ నలుగురు 2022లో శివ్సేనను ఏక్నాథ్ షిండే చీల్చినప్పుడు ఆయన వెంట వచ్చారు.
మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-శివసేన కూటమి 118 (బీజేపీ 89, శివసేన (షిండే) 29) స్థానాల్లోనూ.. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) 65, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, ఎన్సీపీ (శరద్పవార్) 1, కాంగ్రెస్ 24, ఎంఐఎం 8, ఎన్సీపీ (అజిత్ పవార్) 3, ఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో దేశంలో అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన ముంబయిలో 23 ఏళ్ల తర్వాత మేయర్ పీఠం శివసేనకు దక్కకుండా పోయింది. 1997 నుంచి ఇప్పటి వరకూ బీఎంసీ మేయర్ పదవి శివ్సేన వద్దే ఉంది.
అయితే, ఫలితాల తర్వాత హైడ్రామా నడించింది. మేయర్ పదవి కోసం పావులు కదిపిన షిండే.. తన వర్గం కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. అయినాసరే ఆయన ప్రయత్నం ఫలించలేదు. చివరకు బీజేపీకే మేయర్ పీఠం దక్కబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa